Pawan Kalyan
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కు చిరంజీవి సతీమణి సురేఖకు మధ్య ఉన్న బంధం అందరికీ తెలిసిందే. పేరుకే వదిన కానీ.. తల్లితో సమానంగా ఆమెను ట్రీట్ చేస్తారు పవన్. ఆయనలో ఉన్న టాలెంట్ ను గుర్తించింది కూడా సురేఖే. మంచి టాలెంటెడ్ హీరో అవుతారని.. హీరోగా చేయాలని చిరంజీవిని పట్టుబడింది కూడా ఆమె. పవన్ తొలి సినిమా తీయాలని తన సోదరుడు అల్లు అరవింద్ పై ఒత్తిడి పెట్టింది కూడా సురేఖ. సందర్భం ఏదైనా తన వదిన పట్ల తనకున్న మాతృభావనను అనేక సందర్భాల్లో వ్యక్తం చేశారు పవన్. అటువంటి పవన్ ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం తో పాటు మంత్రి కావడంతో మురిసిపోయారు ఆమె. ఏకంగా పవన్ కు మంచి బహుమతి పంపారు.
ఈ ఎన్నికలు మెగా కుటుంబానికి ప్రత్యేకం. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ కుటుంబం పవన్ వెంట నిలిచింది. ఎన్నికల ప్రచారంలో మెగా కుటుంబమంతా పాల్గొంది. నాగబాబు, ఆయన భార్యతో పాటు సాయి ధరంతేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్ లాంటి వారంతా నేరుగా ప్రచారం చేశారు. రామ్ చరణ్, సురేఖ, అల్లు అరవింద్ నేరుగా వచ్చి పవన్ కు మద్దతు తెలిపారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా పవన్ చిరంజీవి ఇంటికి వెళ్ళినప్పుడు భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. ముఖ్యంగా చిరంజీవి, సురేఖల పట్ల పవన్ తన ఆరాధన భావాన్ని చాటుకున్నారు. పవన్ డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చిరంజీవి, రామ్ చరణ్, సురేఖలు ప్రత్యేకంగా హాజరయ్యారు. ప్రత్యేక విమానంలో హైదరాబాదు నుండి విజయవాడ వెళ్లారు.
ఒకటి,రెండు రోజుల్లో మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోనున్నారు. డిప్యూటీ సీఎం హోదా దక్కడంతో సచివాలయంలో ఆయన కోసం ప్రత్యేక చాంబర్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో చంద్రబాబుతో పాటు పవన్ చిత్రపటాలు ఏర్పాటు చేయాలని ప్రత్యేక ఆదేశాలు వచ్చాయి. మరోవైపు పవన్ కోసం ప్రత్యేక కాన్వాయ్ సైతం సిద్ధమవుతోంది. ఇటువంటి తరుణంలో చిరంజీవి సతీమణి సురేఖ పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక గిఫ్ట్ పంపించారు. దానిని చిరంజీవి ధ్రువీకరించారు. పవన్ కోసం ఒక పెన్నును సురేఖ పంపించినట్లు తెలుస్తోంది. ఆ పెన్నుతోనే డిప్యూటీ సీఎం గా పవన్ కీలక ఫైళ్లపై సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. అందుకే పవన్ కోసం పెన్నను గిఫ్ట్ గా పంపించారు ఆయన వదిన సురేఖ. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.