Vijayasai Reddy : వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి గట్టి షాక్ తగిలింది. సుప్రీం కోర్టు గట్టి ఝలక్ ఇచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి ఏ2 నిందితుడిగా కొనసాగుతున్నాడు. చాలా రోజుల తరువాత ఈ కేసుకు సంబంధించి కదలిక వచ్చింది. సీబీఐ దర్యాప్తు కొనసాగుతున్నందున.. దానికి సమాంతరంగా ఈడీ విచారణ అవసరం లేదని అప్పట్లో జగన్ అండ్ కో కోర్టు తలుపు తట్టింది. దీనిపై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. ఎలాంటి విచారణ జరపవద్దంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ ను ఆదేశించింది. ఈ క్రమంలో ఈ చర్యలపై ఈడీ న్యాయపరంగా పోరాడుతోంది. ఎట్టకేలకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలిచ్చింది.
జగన్ అక్రమాస్తుల కేసు విచారణను సీబీఐ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ఈడీ సైతం కొరడా ఝుళిపించింది. ఒక వైపు సీబీఐ విచారణ కొనసాగుతుండగా.. ఈడీ ఎలా దర్యాప్తు చేస్తుందంటూ జగన్ అండ్ కో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈడీకి అడ్డుకట్ట వేయాలని 2021లో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ విచారణ తేలే వరకూ ఈడీ దర్యాప్తు వద్దంటూ తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. అప్పటి నుంచి ఈడీ విచారణ నిలిచిపోయింది. కానీ దీనిపై ఈడీ అధికారులు ఏకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని సుప్రీం కోర్టులో ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పిటీషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు భారతీ సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్ ను చేర్చారు. ఎట్టకేలకు ఈ పిటీషన్ విచారణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబరు 5లోగా సమాధానం చెప్పాలని విజయసాయిరెడ్డితో పాటు జగతి పబ్లికేషన్స్ తో పాటు భారతీ సిమెంట్స్ యాజమాన్యానికి నోటీసులు జారీచేసింది. ఈ నేపథ్యంలో జగన్ అక్రమాస్తుల కేసు మరోసారి తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. సీబీఐ దర్యాప్తుతో పాటు సమాంతరంగా తాము కూడా విచారణ చేపట్టడం సహేతుకమైన చర్యగా ఈడీ అధికారులు సుప్రీం కోర్టులో వాదనలు వినిపించనున్నారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.