Sidiri Appalaraju Arrest: ఎట్టకేలకు మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే తన కుమారుడిని తప్పించి.. ఆయన బదులు సిద్ధార్థ్ త్యాడి అనే మరో వ్యక్తిని పోలీసులు ముందుకు తెచ్చి ప్రమాదం చేసింది అతడేనని నమ్మించారు. కానీ స్థానికుల నిరసనలు, పోలీసుల విచారణలో.. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అసలు నిందితుడు మాజీమంత్రి కుమారుడేనని స్పష్టమైంది. కేసు తప్పుదోవ పట్టించినందుకుగాను మాజీమంత్రి అప్పలరాజు పై కూడా కేసు నమోదు అయింది.
* కేసు తారుమారు..
ప్రమాదం జరిగిన వెంటనే తన కుమారుడు ఆరవ్ స్థానంలో.. సిద్ధార్థ త్యాడిని పోలీసులకు అప్పగించి స్టేషన్ బెయిల్ పొందేలా చేశారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు వేరొకరిని బలిపశువును చేసే ప్రయత్నం చేయడం,, సాక్షాలను తారుమారు చేసి ప్రయత్నాలు చేసినందుకుగాను అప్పలరాజు పై బి.ఎన్.ఎస్ చట్టంలోని కీలక సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేశారు కానీ వర్కౌట్ కాలేదు. అదే సమయంలో మాజీ మంత్రి అరెస్టుపై పోలీస్ శాఖ పై ఒత్తిడి పెరిగింది. అందుకే ఇప్పుడు అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్టును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతోంది. రాజకీయ కక్షతో చేసినదని ఆరోపిస్తోంది. కూటమి పార్టీలు మాత్రం చట్టం తన పని తాను చేసుకునే క్రమంలో ఈ అరెస్టు జరిగిందని చెబుతోంది. చట్టబద్ధమైన విచారణ నుంచి తప్పించుకోవడానికి మాజీ మంత్రి చేసిన ప్రయత్నాలే.. ఆయన అరెస్టు అయ్యే పరిస్థితికి దారితీసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
* సమర్ధించుకుంటున్న వైసిపి..
మాజీ మంత్రి అప్పలరాజు వ్యవహార శైలికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్ధించుకుంటోంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి దీనిని సమర్థించుకున్నారు. ధర్మాన ప్రసాదరావు లాంటి నేతలు అప్పలరాజును పరామర్శించారు. అనుకోకుండా జరిగితేనే ప్రమాదం అంటారు. అటువంటి రోడ్డు ప్రమాదాన్ని ఒకరు చేస్తే మరొకరిపై నెట్టి.. కేసును తప్పుదోవ పట్టించడం వల్ల పరిస్థితి ఇంత దాకా వచ్చింది. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దీనిని ఒక రాజకీయ కోణంగా చూపి.. అక్రమ అరెస్టు పోరాట బాట పడుతుండడం విమర్శలకు తావిస్తోంది.







