YCP: వైసీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీకి వరుసగా సీనియర్లు గుడ్ బై చెబుతున్నారు. వైసీపీ ఓటమి తరువాత చాలామంది నేతలు రాజకీయాలకు దూరమయ్యారు. విజయవాడ లోక్సభ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశినేని నాని రాజకీయాలకు దూరమవుతున్నట్లు ప్రకటించారు. మరో వైసీపీ నేత అలీ తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పుకున్నారు. అటు తరువాత మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు వరుసగా పార్టీని వీడుతున్నారు. ఎమ్మెల్సీలు పద్మశ్రీ, పోతుల సునీత, కళ్యాణ చక్రవర్తి పార్టీతో పాటు పదవులకు గుడ్ బై చెప్పారు. రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ సైతం రాజీనామా చేశారు. ఇక ఆళ్ల నాని, సిద్ధా రాఘవరావు, కిలారు రోశయ్య, మద్దాలి గిరి.. ఇలా నేతలంతా వరుసగా పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. మరికొందరు సైతం రాజీనామా చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకత్వం తో పాటు నగరపాలక సంస్థల మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పార్టీని వీడుతున్నారు. ఎన్నికలకు ముందు నుంచి టీడీపీకి పనిచేసిన వారు.. వైసిపి ఓడిపోయిన తర్వాత పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న వారు.. తెలుగుదేశం గూటికి వస్తున్నారు.
* పశ్చిమగోదావరి జడ్పీ చైర్ పర్సన్ గుడ్ బై
మరోవైపు జిల్లా పరిషత్తు చైర్మన్లు సైతం పెద్ద ఎత్తున పార్టీకి రాజీనామా చేస్తున్నారు. పదవి కోసం టిడిపిలో చేరుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ వైసీపీకి రాజీనామా చేశారు. మంత్రి లోకేష్ సమక్షంలో టిడిపిలో చేరారు. ఆమెతోపాటు జిల్లా బీసీ విభాగం వైసీపీ అధ్యక్షుడు ప్రసాద్ రావు కూడా టిడిపిలోకి వచ్చారు. దీంతో గోదావరి జిల్లాల్లో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.
* పెద్ద ఎత్తున స్థానిక సంస్థల ప్రతినిధులు
ఇప్పటికే ఆ జిల్లా నుంచి చేరికల సంఖ్య భారీగా పెరుగుతోంది. వైసిపికి భవిష్యత్తు లేదని భావిస్తున్న నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర కూడా ఇటీవలే పార్టీ ఫిరాయించారు. ఇది చాలదన్నట్టు ఏలూరు కు చెందిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సైతం జనసేనలో చేరతారని ప్రచారం సాగుతోంది. అదే జరిగితే వైసీపీ ఉనికి గోదావరి జిల్లాలో ప్రశ్నార్ధకంగా మారనుంది.
* వైసీపీకి తగ్గుతున్న బలం
ఉభయగోదావరి జిల్లాల్లో వైసిపి బలం పూర్తిగా తగ్గుతోంది. ప్రధాన సామాజిక వర్గాలు ఆ పార్టీకి దూరమవుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో మెజారిటీ 40 వేల పై మాటే. అప్పటినుంచి వైసీపీ నేతలు ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. గోదావరి జిల్లాల్లో జనసేన మరో పార్టీకి స్పేస్ ఇవ్వదని.. వైసీపీలో ఉంటే ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎక్కువ మంది నేతలు భావిస్తున్నారు. అటువంటి వారంతా కూటమి పార్టీల్లో చేరుతున్నారు. దీంతో వైసిపి అధినాయకత్వం సైతం కలవరపడుతోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More