Homeఆంధ్రప్రదేశ్‌YCP: షర్మిలకు షాక్.. ఆ ఎనిమిది మంది వైసీపీలోకి.. పిసిసి మాజీ అధ్యక్షుడి మంత్రాంగం

YCP: షర్మిలకు షాక్.. ఆ ఎనిమిది మంది వైసీపీలోకి.. పిసిసి మాజీ అధ్యక్షుడి మంత్రాంగం

జగన్ కు కంటిమీద నలుసుగా మారిపోయారు షర్మిల. ఎంతలా ఇబ్బంది పెట్టాలో అంతలా పెడుతున్నారు. అందుకే ఇప్పుడు షర్మిలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు జగన్.

YCP: మాజీ సీఎం జగన్ రూటు మార్చారు. సరికొత్త రాజకీయ పంధాను అనుసరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలో ఒక రకమైన నైరాశ్యం కనిపించింది. దీనికి తోడు పార్టీలో సీనియర్లు బయటకు వెళ్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో బయటకు వెళ్లారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవులు అలంకరించిన వారు సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ఉనికి సైతం ప్రమాదకర స్థితిలో ఉంది. కూటమి దెబ్బకు విలవిలలాడుతోంది వైసిపి. అదే సమయంలో షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నారు జగన్. కాంగ్రెస్ కంటే షర్మిల రూపంలోనే ఇప్పటికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

* పార్టీపై జగన్ ఫోకస్
అయితే ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటున్న జగన్ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. వరుసగా పార్టీ శ్రేణులతో సమావేశం అవుతున్నారు. నిత్య సమీక్షలు జరుపుతున్నారు. పార్టీని వీడుతున్న వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తున్నారు. ఉన్నవారితోనే రాజకీయం చేసి వచ్చే ఎన్నికల్లో గట్టిగానే దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. షర్మిల లక్ష్యంగా జగన్ ఢిల్లీ కేంద్రంగా కొత్త రాజకీయాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లతోనే ఆమెకు చెక్ చెప్పాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఆమె నాయకత్వాన్ని విభేదిస్తున్న చాలామంది కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారు.

* కాంగ్రెస్ సీనియర్ల ఆకర్ష్
వైసీపీ నాయకులు కూటమి వైపు వెళ్తున్నారు. అది కేసులకు భయపడో.. లేకుంటే మరో రకమైన ఇబ్బందులు వస్తాయనో వెళ్తున్న వారే అధికం.అందుకే జగన్ వ్యూహం మారింది. కాంగ్రెస్ పార్టీలో మిగిలిన చిన్నాచితకా నాయకులను వైసీపీలోకి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా పిసిసి మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వైసీపీలో చేరడానికి సిద్ధపడ్డారు. ఆయన ఒక్కరే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మంది కాంగ్రెస్ సీనియర్లు వైసీపీలోకి రప్పించేందుకు జగన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు శైలజా నాథ్ కు కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో జగన్ ను కలిసిన శైలజానాథ్ వైసీపీలోకి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేయగా.. జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయనతోపాటు మరో ఎనిమిది మంది సీనియర్లు ఒకేసారి వైసీపీలో చేరేందుకు ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper