Pavan Kalyan properties : జనసేన ఆవిర్భవించి సుదీర్ఘకాలం అవుతోంది. 2014 ఎన్నికలకు ముందు పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్. 2024 వరకు సరైన విజయం దక్కలేదు. పవర్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. ఎన్నికల్లో మాత్రం సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. శత శాతం విజయంతో దూసుకుపోయారు. అయితే తన సొంత డబ్బులను ఖర్చుపెట్టి పార్టీని నడిపానని.. జనసేన ను నిలబెట్టుకున్నానని పవన్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.అయితే ఆస్తులు అమ్ముకుంటే.. ఉన్న ఆస్తులు ఎందుకు తరగలేదని వైసిపి ప్రశ్నిస్తోంది.దీనిపై సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించింది. పార్టీ కోసం అన్ని అమ్ముకున్నానని చెబుతున్న పవన్ కు ఇన్ని ఆస్తులు ఎక్కడివని.. 2024 ఎన్నికల అఫిడవిట్లో సమర్పించిన ఆస్తుల వివరాలను ప్రదర్శిస్తోంది. 2019 ఎన్నికల్లో సమర్పించిన ఆస్తుల వివరాలను సరిపోల్చుతూ.. పవన్ ఎక్కడ ఆస్తులను అమ్ముకున్నారని వైసిపి సోషల్ మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఇదే వైరల్ అంశంగా మారింది. పార్టీని నడపడం అంత ఈజీ కాదని.. చాలా రకాల ఇబ్బందులు పడ్డానని..విలువైన ఆస్తులను పార్టీ కోసం అమ్ముకున్నానని పవన్ తో పాటు నాగబాబు కూడా చెప్పుకునేవారు.అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా అఫిడవిట్లో 2019 కంటే 2024 ఎన్నికల్లో ఆస్తులు పెరిగినట్లు చూపించారు. ఇప్పుడు దానినే వైసీపీ హైలెట్ చేస్తోంది.
* పెరిగిన ఆస్తుల విలువ
2019 ఎన్నికల్లో సమర్పించిన అఫీడవిట్లో కంటే.. 2024 ఎన్నికల్లో సమర్పించిన అఫీడవిట్లో ఆస్తుల విలువ ఏకంగా 191% పెరిగినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల సమయంలో సమర్పించిన ఎన్నికల పవన్ కళ్యాణ్ తనకు 56 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. అలాగే తన భార్య అన్నా లెజినోవా పేరుతో కోటి విలువైన ఆస్తి ఉన్నట్లు చూపించారు. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి తన ఆస్తుల విలువను 163 కోట్లుగా చూపించారు పవన్.
* ఐదేళ్లలో 114 కోట్ల ఆర్జన
అయితే ఐదేళ్లలో 114 కోట్ల రూపాయలు ఆర్జించినట్లు అఫిడవిట్లో స్పష్టమైంది. అదే సమయంలో ఆదాయపన్నుగా 47 కోట్లు చెల్లించినట్లు చూపించారు. జీఎస్టీకి 26 కోట్లు చెల్లించగా.. మొత్తంగా పన్నుల రూపంలో ప్రభుత్వానికి 73 కోట్లు చెల్లించినట్లు పవన్ తన ఆఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే అదే స్థాయిలో అప్పులను కూడా చూపించారు 64 కోట్ల వరకు అప్పులు ఉన్నట్లు పేర్కొన్నారు. అందులో బ్యాంకుల నుంచి 17 కోట్లు, వ్యక్తుల నుంచి 46 కోట్లు తీసుకున్నట్లు చూపించారు. ఈ ఐదేళ్లలో 20 కోట్ల వరకు విరాళాల రూపంలో ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా, క్రియాశీలక కార్యకర్తలకి ప్రమాద బీమా లాంటి కార్యక్రమాల కోసం ఈ విరాళాలు అందించినట్లు చెప్పుకొచ్చారు.
* దానినే హైలెట్ చేస్తున్న వైసిపి
అయితే పవన్ కళ్యాణ్ తరచూ తను ఆస్తులు అమ్ముకున్నట్లు ప్రకటించుకోవడాన్ని వైసీపీ ఇప్పుడు హైలైట్ చేస్తోంది. ఆస్తులు అమ్ముకుంటే తగ్గిపోతాయి కానీ.. ఐదేళ్ల కాలంలో ఎలా పెరిగాయి అని ప్రశ్నిస్తున్నారు. అయితే ప్రతి సినిమాకు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటానని పవన్ స్వయంగా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. గత ఐదేళ్లలో ఆయన చాలా బ్లాక్ బస్టర్ హిట్లను కొట్టారు. ఆ సొమ్మునే ఖర్చు పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఒకవైపు ఆదాయం వస్తుండగా.. వాటిని ఖర్చు పెట్టినట్లు పవన్ చెప్పుకొచ్చారు. అయితే వైసిపి సోషల్ మీడియా మాత్రం ఆ అభిప్రాయంతో ఏకీభవించడం లేదు. ఆస్తులు అమ్ముకున్నానని చెప్పారు కాబట్టి.. అమ్ముకున్న ఆస్తులు ఏంటో చెప్పాలని డిమాండ్ చేయడం విశేషం. అయితే దీనిపై జనసైనికులు స్ట్రాంగ్ గా రిప్లై ఇస్తున్నారు.ఐదేళ్లలో పవన్ కు భారీగా ఆదాయం వచ్చినా అందుకు తగ్గట్టు ఆస్తులు కొనుగోలు చేయలేదని..ఉన్న ఆస్తులనువిక్రయించుకున్నారని చెప్పుకొస్తున్నారు. మొత్తానికైతే పవన్ ఆస్తుల రగడ సోషల్ మీడియాలో పెద్ద రచ్చగా మారింది.
ఎన్నికల ముందు ప్రజల్లో సానుభూతి కోసం ఎలక్షన్ స్టంట్లు తీరా చూస్తే అసలు నిజం ఇది. pic.twitter.com/fe9xECOjIM
— Hariswar Reddy (@hariswar_Reddy_) August 27, 2024
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More