HomeతెలంగాణMLC Kavitha: నా పోరాటం అన్‌ బ్రేకబుల్‌.. కల్వకుంట్ల కవిత ఏం చేయనుంది?

MLC Kavitha: నా పోరాటం అన్‌ బ్రేకబుల్‌.. కల్వకుంట్ల కవిత ఏం చేయనుంది?

MLC Kavitha:  దేశంలోనే సంచలనం సృష్టించి అనేక కుంభకోణాలు ఉన్నాయి. కానీ, మూడేళ్ల క్రితం జరిగిన ఢిల్లీ మద్యం కుంభకోణంతో నేరుగా తెలంగాణకు లింకులు ఉండడం సంచలనంగా మారింది. ఎక్కడ ఢిల్లీ.. ఎక్కడ తెలంగాణ.. అయినా అధికారం ఉంటే ఏ దందాలు అయినా అన్నదే గులాబీ నేతల భావన. అదే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమికి దారి తీసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేసీఆర్‌ కూతురు కవితకు లింకులు ఉన్నా.. స్పందించలేదు. కాళేశ్వరం కుంగిపోయినా చిన్న సమస్య అని ప్రకటించారు. అహంకార పూరిత మాటలు, చేష్టలు, అక్రమాస్తులు.. ప్రశ్నపత్రాల లీకేజీలు ఇలా అన్నీ కలిసి కేసీఆర్‌ పతనాన్ని శాసించాయి. ఐదు నెలలు కూతురు జైల్లో ఉన్నా వెళ్లి పలకరించని కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికల సమయంలో మాత్రం కూతురు జైల్లో ఉన్నందుకు గుండెల్లో అగ్నిపర్వతం బద్దలవుతుందని పేర్కొన్నారు. తన కూతురు ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు. మార్చి 15న అరెస్ట్‌ అయిన కవిత సుమారు ఐదున్నర నెలలు తిహార్‌ జైల్లో ఉన్నారు. సుప్రీం కోర్టు బెయిల్‌ ఇవ్వడంతో బయటకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. ‘నన్ను జైలుకు పంపి మొండిని జగమొండి చేశారు.. ఇబ్బందులకు గురి చేసిన వాళ్లకు తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం.. అందుకు తగ్గ సమయం వస్తుంది’ అని ప్రకటించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు తెరలేపాయి. జైలు గేటు దాటగానే పగతో రగిలిపోయినట్లు కవిత.. శపథం చేయడం ఇప్పుడు తెలంగాణలో సరికొత్త చర్చకు దారితీసింది. గతంలో కేసీఆర్‌ కూడా ఇలాగే శపథాలు చేశారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని గద్దె దించుతం.. బీజేపీని బంగాళాఖాతంలో కలుపుతం అని ప్రకటించారు. కానీ అవి నెలరవేరలేదు. కానీ, ఇప్పుడు కవిత చేసిన శపథం నేపథ్యంలో కవిత ఏం చేస్తారు. రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది.

కవితపై తీవ్ర ఆరోపణలు..
ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కవిత కింగ్‌ పిన్‌ అని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుండంతో కల్వకుంట్ల కుటుంబం ఆమెను రాజకీయాలకు దూరంగా ఉంచనుంది అనే ప్రచారం గత కొద్ది రోజుల కిందట జరిగింది. కవిత కారణంగానే మచ్చలేని ఆప్‌ పార్టీకి మద్యం కుంభకోణం మాయని మచ్చగా మారిందన్న అభిప్రాయం ఉంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కవిత లిక్కర్‌ స్కామ్‌ ఎపిసోడ్‌ తీవ్ర ప్రభావం చూపిందన్న అభిప్రాయం గులాబీ శ్రేణులతోపాటు ఆ పార్టీ బాస్‌కూ తెలుసు. ఈ లిక్కర్‌ స్కామ్‌ వ్యవహారం పార్టీ అప్రతిష్టకు కారణమైందని, అందుకే జైల్లో కవితను చూసేందుకు కూడా కేసీఆర్‌ వెళ్లలేదని టాక్‌ నడిచింది. ఈ క్రమంలోనే కవితకు బెయిల్‌ దక్కడంతో ఆమె రాజకీయ కార్యాచరణ ఎలా ఉండనుంది అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

కవితతో కలిసి వచ్చేదెవరు..
కవిత సుప్రీంకోర్టులో బెయిల్‌ లభించగానే ఆమె రాజకీయ ప్రయాణంపై రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలు అయ్యాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ధర్మపురి అర్వింద్‌ చేతిలో ఓడిపోయిన కవిత అవమానభారంతో దాదాపు రెండేళ్లు బయటకు రాలేదు. తండ్రి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాక మళ్లీ యాక్టివ్‌ అయ్యారు. ఇప్పుడు ఐదున్నర నెలలు జైల్లో ఉన్నారు. ఆమె జైలుకు వెళ్లింది ప్రజల కోసం కాదు. ఉద్యమం చేసి కాదు. కుంభకోణంలో ఇరుక్కుని వెళ్లారు. కానీ ఆమె జైలు నుంచి వస్తూనే పిడికిలి బిగించారు. వీరనారిలా బయటకు వచ్చి జైలు బయటే మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం కూడా ఇటీవలై జైలు నుంచి బయటకు వచ్చారు. కానీ, ఆయన కవితలా స్పందించలేదు. సైలెంట్‌గా ఇంటికి వెళ్లిపోయారు. కేజ్రీవాల్‌ కూడా మధ్యంతర బెయిల్‌పై వచ్చారు. ఢిల్లీ ఆయన సొంత రాష్ట్రం కానీ ఎలాంటి హడావుడి చేయలేదు. కవిత మాత్రం జైలు బయట చర్చ చేశారు. శపథం చేశార. తనను ఇబ్బందిపెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కవిత రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటారన్నది స్పష్టమైంది. అయితే ఆమె ఎవరితో కలిసి పోరాటం చేస్తారు. ఆమెతో కలిసి పోరాడేది ఎవరు అన్న చర్చ జరుగుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular