Pawan Kalyan: పవన్ ప్రసంగ శైలి మారుతోంది . ప్రజల గుండెలను తాకుతోంది. ఏదైనా అంశంపై పవన్ మాట్లాడినప్పుడు.. సడన్ గా మరో అంశానికి చేంజ్ అవుతారని ఒక అపవాదు ఉంది. కానీ ఇటీవల ఎన్నికల ప్రచార సభల్లో పవన్ మాట్లాడుతున్న తీరు మాత్రం.. అబ్బురపరుస్తోంది. ప్రజలను ఆలోచింప చేస్తోంది. ముఖ్యంగా తెనాలిలో పవన్ ప్రసంగ శైలిని గమనిస్తే ప్రత్యర్థులు సైతం అభిమానించక మానరు. ఒక్కో మాట ఆయన నోటి నుంచి బుల్లెట్ లా దూసుకొచ్చింది. వైసిపి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టింది.
17 ఏళ్ల బాలుడిని ఫ్రాన్స్ లో పోలీసులు కాల్చి చంపితే ఆ దేశం అట్టుడికి పోయింది. అదే 17 ఏళ్ల పిల్లాడిని కుల ఉన్మాదంతో ఓ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పెట్రోల్ పోసి కాల్చి చంపితే మన దగ్గర కదలిక రాలేదు. స్వయంగా చనిపోయే ముందు వాంగ్మూలం ఇచ్చినా.. ఆ బీసీ బిడ్డ అక్క పై, కుటుంబం పై నిందలు వేసి పక్కదారి పట్టించారే తప్ప.. బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కు కొద్దిగా గీసుకుపోతే.. ఏపీ ప్రజలకు జరిగిన గాయం అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్న విషయాన్ని పవన్ ప్రస్తావించారు. ఇవన్నీ ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. రేపల్లె రైల్వేస్టేషన్లో భర్త ముందే మహిళపై మానభంగం చేస్తే.. దొంగతనం కోసం వచ్చి పొరపాటున చేశారని ఓ మంత్రి సెలవివ్వడం దేనికి సంకేతం అని పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రస్తుతం పవన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాబాయిని చంపేశారని ఇద్దరు చెల్లెళ్ళు గొంతు చించుకుంటే ఒక్క పోలీసు అధికారి మాట్లాడడు. సిబిఐ వస్తే కడప కోటలోకి వెళ్ళనివ్వరు. ఇంత దారుణాలు జరుగుతుంటే మనకి పట్టదు. ఒక వ్యక్తిని గొడ్డలితో నరికి చంపితే గుండె పోటు అంటారు. మనం మాత్రం చేతులు ముడుచుకుని కూర్చుంటామని ఆవేశంగా ప్రజలను పవన్ ప్రశ్నించారు. అయితే ఆవేశంగా మాట్లాడిన పవన్ ను చూశాం కానీ.. ఆయన ఆవేశంలో ఉన్న నిజాయితీని ప్రత్యర్థులు సైతం హాట్సాఫ్ చెప్తున్నారు. రాష్ట్రంలో ఐదేళ్లుగా జరిగిన అన్యాయాలకు జగనే కారణమని.. నేరస్తులను నెత్తిన పెట్టుకున్న పాపానికి శవాలు డోర్ డెలివరీ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆడవారి మాట ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోయిందంటూ పవన్ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అన్యాయం వెనుక జగన్ తో పాటు ఆ నలుగురు ఉన్నారని.. ప్రజలకు ఉపాధి లేకుండా విధ్వంసం సృష్టించారని పవన్ చేసిన ప్రసంగం సామాన్యులకు సైతం తాకింది. పవన్ ప్రసంగాన్ని విన్న వారు గత ఐదేళ్లుగా ఎంత కోల్పోయామా? అన్న ప్రశ్న వేసుకుంటున్నారు. ప్రత్యర్థుల్లో సైతం ఒక రకమైన చేంజ్ కు పవన్ ప్రసంగం కారణమవుతోంది. అయితే ఎన్నికల వరకు పవన్ ఇదే తరహా ప్రసంగాలను కొనసాగిస్తే మాత్రం వైసీపీకి ఇబ్బందికరమే.