Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: జగన్ నీతో యుద్ధమే.. చంద్రబాబు ను పరామర్శించాక టిడిపి తో కలిసి పోటీపై...

Pawan Kalyan: జగన్ నీతో యుద్ధమే.. చంద్రబాబు ను పరామర్శించాక టిడిపి తో కలిసి పోటీపై పవన్ సంచలన ప్రకటన

Pawan Kalyan: జగన్ తో ఇక యుద్ధమేనని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇంకా ఆరు నెలలు మాత్రమే మీకు సమయం ఉందని.. తప్పులు సరిదిద్దుకోవాలని.. యుద్ధమే కావాలంటే చేసి చూపిస్తామని జగన్ ను హెచ్చరించారు. స్కిల్ స్కాంలో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును పవన్ పరామర్శించారు. ప్రత్యేక విమానంలో రాజమండ్రి వెళ్లిన పవన్.. నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్ లతో ములాఖత్ లో చంద్రబాబును కలుసుకున్నారు. పలు అంశాలపై చర్చించారు. ఇవాల్టి ములాఖత్ ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమని పవన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబును కలిసిన అనంతరం బాలకృష్ణ, లోకేష్ లతో కలిసి మీడియా సమావేశంలో పవన్ మాట్లాడారు.

గత నాలుగున్నర ఏళ్ల జగన్ పాలన అరాచకంగా సాగిందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. అరాచకంలోనే భాగంగా చంద్రబాబుపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్ కోసం తాను ఒక కీలక నిర్ణయం తీసుకున్నానని పవన్ ప్రకటించారు. వైసీపీని సమిష్టిగా ఎదుర్కొనే సమయం ఆసన్నమైందని చెప్పుకొచ్చారు. జగన్ ఒక ఆర్థిక నేరస్తుడు కాగా.. చంద్రబాబు ఒక రాజకీయవేత్త అని అభివర్ణించారు. సైబరాబాద్ నిర్మించిన వ్యక్తిని జైలులో పెట్టడం బాధాకరమన్నారు. ప్రత్యేక హోదా విషయంలో తెలుగుదేశం పార్టీ తీసుకున్న విధాన నిర్ణయాన్ని విభేదించానే తప్ప.. వ్యక్తిగతంగా కాదని గుర్తు చేశారు.జగన్ పరిపాలన బాగుంటే రాజకీయంగా నేను, బాలకృష్ణ, లోకేష్ కలవాల్సిన అవసరం ఉండేది కాదని చెప్పుకొచ్చారు. ఒకవేళ కలవాల్సి వస్తే అది వ్యక్తిగతంగా తప్ప రాజకీయాల కోసం కాదు అని పవన్ నొక్కి చెప్పారు. చంద్రబాబు అరెస్టు రాజకీయ ప్రతీకారం తప్ప మరొకటి లేదని కొట్టి పారేశారు.

తాను అవినీతి బురదలో కూరుకుపోయానని.. మరొకరికి బురద అంటించే ప్రయత్నం జగన్ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇసుక, మైనింగ్, బెల్ట్ షాపుల్లో అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలను విడిచి పెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఏపీ దుస్థితిపై ప్రధాని మోదీ, అమిత్ షాలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.అధికారుల సైతం ఆలోచించుకోవాలని పవన్ సూచించారు. పోలీస్ వ్యవస్థ ఇంత బానిసత్వంగా మారడం దారుణ చర్యగా అభివర్ణించారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు మాపై రాళ్లు వేసే ముందు ఆలోచించుకోవాలని పవన్ సూచించారు. రాళ్లు వేసిన ఎవ్వరిని వదిలి పెట్టేది లేదని తేల్చి చెప్పారు. ఏపీ భవిష్యత్ బాగుండాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు.

ఏపీ భవిత కోసమే తాను ఆలోచిస్తానని పవన్ ప్రకటించారు. 2014లో సైతం ఏపీలో టీడీపీకి, కేంద్రంలో ఎన్డీఏకు మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏపీ ప్రజలు వైసీపీ పాలనతో విసిగిపోయారని చెప్పారు. అందుకే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయని పవన్ ప్రకటించారు. బిజెపి సైతం తమతో కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను తీసుకున్న ఈ నిర్ణయం టిడిపి కోసమో, జనసేన కోసమో కాదన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఈ రాజకీయ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం కలిసి వెళ్తాయని స్పష్టం చేశారు. తాను ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటివరకు మోడీ పిలిస్తేనే తాను వెళ్లి కలిసినట్లు గుర్తు చేశారు. వారి విలువైన సమయాన్ని వృధా చేయకూడదన్నదే తన అభిమతం అన్నారు. పవన్ తాజా ప్రకటనతో పొత్తులపై ఫుల్ క్లారిటీ వచ్చింది. గత కొద్ది రోజులుగా చంద్రబాబు అరెస్టుతో ఆందోళనతో ఉన్న టిడిపి క్యాడర్ కు పవన్ తాజా ప్రకటనలు ఉపశమనాన్నిచ్చాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular