Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో వైరం ఉందనే చెప్పాలి. నిన్న హైదరాబాద్ ప్రెస్మీట్లో కూడా రాజశేఖర్ రెడ్డి విషయాన్ని ప్రస్తావించారు. ఆయన మూలంగానే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పుకొచ్చారు. ఆయన తమను ఇబ్బంది పెట్టారని.. అందుకే ఇంతటి వ్యతిరేకత అన్నట్టు సంకేతాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్. 2004 నుంచి 2010 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు రాజశేఖర్ రెడ్డి. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారు మెగాస్టార్ చిరంజీవి. అయితే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. ఆ సమయంలో చిరంజీవి కుటుంబానికి బెదిరింపులు వచ్చి ఉంటాయి. అదే సమయంలో కొన్ని రకాల కుటుంబ వివాదాలు కూడా జరిగాయి. తప్పకుండా ఆ సమయంలోనే ఏదో జరిగి ఉంటుంది. దానిని ప్రస్తావించిన పవన్ రాజశేఖర్ రెడ్డి తీరు వల్లే తాను రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
* బెదిరింపుల పర్వం..
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం 25 సంవత్సరాల పాటు వేచి చూశారు. 2004లో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటివరకు ఒక ఎత్తు.. అప్పటినుంచి ఒక ఎత్తు అన్నట్టు పరిస్థితి మారింది. విపరీతమైన సంక్షేమ పథకాలతో ఆయన ప్రజామోదం పొందారు. అయితే ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థులను బెదిరించారు అన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో కొన్ని రకాల బెదిరింపులు వెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత.. ఎన్నికల్లో 70 లక్షల ఓట్లు సాధించిన పిఆర్పి కాంగ్రెస్లో విలీనం వెనుక కూడా రాజశేఖర్ రెడ్డి కుటిల ప్రయత్నాలు ఉన్నట్లు పవన్ కళ్యాణ్ లో ఒక అనుమానం ఉంది. పైగా సంక్షేమాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిన వ్యవహారంపై కూడా పవన్ సీరియస్ గా ఉన్నారు. దాని పర్యవసానమే జగన్మోహన్ రెడ్డి పై ఆయన కోపం.
* అడ్డగోలు దోపిడీపై..
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా దోపిడీకి పాల్పడ్డారు అనేది పవన్ కళ్యాణ్ లో ఉన్న అనుమానం. వైయస్ రాజశేఖర్ రెడ్డి పై ద్వేషం జగన్మోహన్ రెడ్డి పై కూడా కొనసాగించారు పవన్. అందుకే 2014 ఎన్నికల్లో పార్టీని స్థాపించి టిడిపికి మద్దతు తెలిపారు. 2019లో ప్రత్యేక పరిస్థితుల్లోనే ఒంటరి పోరాటానికి మొగ్గు చూపారు. 2024 లో మాత్రం పొత్తు కోసం అహర్నిశలు శ్రమించారు. ఇప్పుడు కూటమి 15 ఏళ్ల పాటు ఏపీలో కొనసాగుతుందని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. వైయస్ పై ఉన్న ద్వేషం జగన్మోహన్ రెడ్డి పై కొనసాగిస్తున్న పవన్.. కూటమి విచ్చిన్నానికి జరుగుతున్న ప్రయత్నాన్ని కూడా అడ్డుకుంటున్నారు. మొత్తానికైతే పవన్ ద్వేషం ఈనాటిది కాదన్నమాట జగన్ పై.
