Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: పొత్తులపై పవన్ కీలక ప్రకటన

Pawan Kalyan: పొత్తులపై పవన్ కీలక ప్రకటన

Pawan Kalyan: తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రాథమిక స్థాయిలో పూర్తయినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆ రెండు పార్టీలతో కలిసేందుకు బిజెపి సైతం సమ్మతించినట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ వెళ్లి చంద్రబాబు బిజెపి అగ్ర నేతలతో సమావేశం అయ్యారు. పొత్తుల ప్రతిపాదన తీసుకొచ్చారు. అటు బిజెపి ప్రతిపాదనలను సైతం విన్నారు. దీనిపై ఒక నిర్ణయానికి రానున్నారు. అయితే అటు జనసేన, ఇటు బిజెపికి సీట్లు కేటాయించాల్సి ఉండడంతో టిడిపిలో ఒక రకమైన భిన్న వాతావరణం నెలకొంది. నేతలు లోలోపల ఆందోళన చెందుతున్నారు. పొత్తులో భాగంగా ఎక్కడ తమ సీటు కోల్పోవాల్సి వస్తుందేమోనని బెంగ వారిని వెంటాడుతోంది. మరోవైపు జనసేన శ్రేణుల నుంచి సైతం సీట్ల డిమాండ్ అధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే కొందరు సోషల్ మీడియాలో అతిగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. దీంతో ఇది పొత్తులపై ప్రభావం చూపేలా ఉంది.

రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన మధ్య పొత్తు కుదరడం, బిజెపి సైతం కలిసి రానుండడంతో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన భావన నెలకొంది. ఎలాగైనా ఈ పొత్తు విచ్చిన్నం చేయడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు ఇలా ఢిల్లీ వెళ్లారో లేదో.. జగన్ సైతం హస్తిన బాట పట్టారు. ఏకంగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. హోం మంత్రి అమిత్ షా తో భేటీ కావాలనుకున్న ఆయన అపాయింట్మెంట్ లభించలేదు. అయితే పొత్తులపై ఒక రకమైన ప్రభావం కలిగించేందుకే జగన్ ఢిల్లీ వెళ్లినట్లు టాక్ నడుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో మూడు పార్టీల మధ్య ఒక రకమైన విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ప్రత్యేక ప్రకటన జారీ చేశారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి జనసేన ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని పవన్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే పొత్తుల దిశగా ముందుకు వెళుతున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని.. ఈ దశలో పార్టీ నాయకులు ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. జనసేన విధానాలకు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేయవద్దని కోరారు. అలా చేస్తే రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే వారవుతారని హెచ్చరించారు. వ్యక్తిగత అభిప్రాయాలు, సందేహాలు ఉంటే జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి హరి ప్రసాద్ దృష్టికి తీసుకెళ్లాలని పవన్ సూచించారు. రాజకీయ ప్రత్యర్థులు పొత్తులను విఘాతం కలిగించే దిశగా ఆలోచన చేస్తున్నారన్న సమాచారం మేరకు పవన్ స్పందించినట్లు తెలుస్తోంది. మరోవైపు పార్టీ విధానాలపై బహిరంగంగా మాట్లాడి.. పొత్తులపై భిన్నంగా ప్రకటనలు చేసేవారి నుంచి వివరణలు సైతం తీసుకోవాలని పార్టీ వర్గాలకు పవన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మొత్తానికైతే పొత్తుల విషయంలో పవన్ గట్టిగానే ఉన్నారు. పొత్తులకు విఘాతం కలిగించే చిన్నపాటి ప్రయత్నాలను ఆదిలోనే అణచివేయాలని భావిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular