Nara Lokesh Meets Pawan Kalyan: ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు సమీపిస్తోంది. గత 20 నెలలుగా కూటమి సమన్వయంతో ముందుకు సాగుతోంది. అయితే ఇలా ఉంటుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా తెలియదు. తొలుతా పొత్తు కుదరదు అనుకున్నారు. కుదిరినా సీట్ల పంపకాలు జరగవనుకున్నారు. సీట్ల సర్దుబాటు జరిగినా ఓట్ల బదలాయింపు జరగదని భావించారు. కూటమి గెలిచిన తర్వాత మంత్రివర్గం కూర్పులో అసంతృప్తి మొదలవుతుందని అంచనా వేశారు. నామినేటెడ్ పదవుల పంపకాల్లో సైతం తేడా కొడుతుందని చూశారు. అన్నింటికీ మించి డిప్యూటీ సీఎం పవన్ తో.. నారా లోకేష్ కు విభేదాలు తప్పవు అని అంచనా వేశారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ అంచనాలకు మించి వారిద్దరి మధ్య బంధం రోజురోజుకు బలపడుతోంది. ఇప్పట్లో వారిద్దరిని విడగొట్టడం అంత సులువు కాదని తేలిపోయింది. పవన్ విషయంలో లోకేష్ గౌరవభావంతో ఉంటారు. లోకేష్ విషయంలో పవన్ అభిమానంతో పాటు ఆప్యాయత చూపుతుంటారు. వారిద్దరి మధ్య బంధం పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు.

* ఆత్మీయ కలయిక..
తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను( deputy CM Pawan Kalyan) మంత్రి నారా లోకేష్ కలుసుకున్నారు. ఈరోజు నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా కలుసుకున్నారు మంత్రి లోకేష్. లోకేష్ ను సాదరంగా ఆహ్వానించిన పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బంధం అంటే అలా ఉండాలి అనేటట్టు కూటమి పార్టీలు ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాయి. అయితే ఇటువంటి దృశ్యాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఎంత మాత్రం మింగుడు పడవు. అందుకే వారు భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు.
* ఆరోగ్యకరమైన పోటీ..
పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా ఉన్నారు. ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం హోదాలో కొనసాగుతున్నారు. దాదాపు నాలుగు మంత్రిత్వ శాఖలను నిర్వర్తిస్తున్నారు. నారా లోకేష్ కీలకమైన విద్యాశాఖ తో పాటు ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖలను చూస్తున్నారు పవన్. పాఠశాల విద్యాశాఖ తో పాటు మానవ వనరుల శాఖ లోకేష్ వద్ద ఉంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలను కలుస్తున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. గ్రామీణాభివృద్ధి విషయంలో పవన్.. విదేశీ పెట్టుబడుల విషయంలో లోకేష్ పోటీపడి మరి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వారి మధ్య రాజకీయ విభేదాలు వస్తాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశించింది. కానీ వారిద్దరూ ఆరోగ్యకరమైన పోటీలోనే ముందున్నారు. ఒకరిపై ఒకరు గౌరవం, అభిమానాన్ని కొనసాగిస్తున్నారు. లోకేష్ సాధించిన ఈ పరిణితి టిడిపి తో పాటు జన శ్రేణులను సైతం ఆకర్షిస్తోంది