Nagababu: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని వార్తలు వస్తున్నాయి.. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు నాగబాబు ఒక్కసారిగా అజ్ఞాతవాకి వెళ్లిపోవడం పట్ల జనసేన నాయకుల్లో ఆందోళన నెలకొంది.. అనకాపల్లి పార్లమెంటు స్థానం ఆయనకు కేటాయించకపోవడం వల్లే ఇదంతా జరిగిందని సమాచారం. వాస్తవానికి అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని ఆయనకు ఇస్తారని ఇటీవల ప్రచారం జరిగింది. నాగబాబు కూడా అదే విధమైన సంకేతాలు ఇచ్చారు. ఇటీవల కాలం నుంచి అనకాపల్లి పార్టీ నాయకులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కొద్ది రోజులపాటు అక్కడ పర్యటించారు కూడా. ఇక టికెట్ కూడా దాదాపు ఓకే అయ్యిందనుకుంటున్న తరుణంలో.. ఒక్కసారిగా నాగబాబు సైలెంట్ అయిపోయారు. ఆయనకు కాకుండా వేరే వాళ్లకు టికెట్ ఇచ్చారని తెలియడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు.. టికెట్ లేదని తెలియడంతో ఆయన ఈ చర్యకు పాల్పడ్డారని తెలుస్తోంది.
వాస్తవానికి ఇటీవల పొత్తులో జనసేనకు 24 అసెంబ్లీ, మూడు పార్లమెంటు స్థానాలు (కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి) టిడిపి కేటాయించింది. అనకాపల్లి స్థానం నుంచి నాగబాబు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. దానికి తగ్గట్టుగానే నాగబాబు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ చివరి క్షణంలో బిజెపి కూటమిలో చేరడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అనకాపల్లి స్థానాన్ని బిజెపికి ఇవ్వాల్సి వచ్చిందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కాకినాడ, మచిలీపట్నం స్థానాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ అభ్యర్థులను ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు పొత్తులో భాగంగా అనకాపల్లి నుంచి బిజెపి పోటీ చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. అలాంటప్పుడు నాగబాబుకు టికెట్ దక్కలేదు. పార్టీ పెద్దల నుంచి ఈ సంకేతాలు రావడంతో ఒక్కసారిగా నాగబాబు నైరాశ్యానికి గురయ్యారు. దీంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వస్తుండడంతో జనసేన కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు.
వాస్తవానికి 24 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంటు సీట్లు అని ప్రకటించినప్పుడే జనసేన లో అంతర్గతంగా కలహాలు చోటు చేసుకుంటున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఓ వర్గం మీడియా వీటి గురించి ప్రత్యేకంగా ఫోకస్ చేయడం లేదు గాని.. సోషల్ మీడియాలో దీని గురించి విపరీతమైన చర్చ జరుగుతోంది. కొంతమంది నాయకులు ఇలా తక్కువ సీట్లు తీసుకుంటే ఎలా? అని ప్రశ్నిస్తే.. ఉంటే ఉండండి, పోతేపొండి అనే సమాధానం అధిష్టానం నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడికి కూడా టికెట్ దక్కకపోవడం పట్ల పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాగబాబు అజ్ఞాతంలోకి వెళ్లడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడంతో పార్టీలో ఏం జరుగుతుందో అంతు పట్టకుండా ఉంది. ఎన్నికల ముందు ఈ పరిస్థితి నెలకొనడం పట్ల కార్యకర్తలు కూడా ఒకింత ఆందోళనతో ఉన్నారు. మరి ఈ సమస్యను పవన్ కళ్యాణ్ ఎలా పరిష్కరిస్తారనేది చూడాలి.