Amaravati
Amaravati: ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబుకు అమరావతి ప్రాధాన్య ప్రాజెక్టు. దానిని పూర్తి చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. లేకుంటే మాత్రం లేనిపోని విమర్శలు ఆయనపై రాక మానవు. ఈ రాష్ట్రానికి రాజధాని లేకపోవడం, అభివృద్ధి చేయకపోవడం వంటి కారణాలతోనే జగన్ ను ప్రజలు అధికారం నుంచి దూరం చేశారు. ఎన్నో అంచనాలతో చంద్రబాబు నాయకత్వానికి జై కొట్టారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు సైతం అమరావతిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అనుకోని అదృష్టంగా కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏకు అనుకున్నంత మెజారిటీ రాలేదు. టిడిపి బలం కీలకంగా మారింది. అందుకే ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కంటే.. రాష్ట్ర ప్రయోజనాలకు చంద్రబాబు పట్టు పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్రం నుంచి అమరావతికి నిధులు రప్పించేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తాజాగా ఢిల్లీలో ఉన్న చంద్రబాబు ప్రధానితో పాటు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. అమరావతికి తక్షణసాయంగా 100 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం కేంద్రానికి అడిగే స్థితిలో చంద్రబాబు ఉన్నారు. కానీ గతం మాదిరిగా డిమాండ్ చేయరు. బ్లాక్ మెయిల్ కు సైతం దూరంగా ఉండే అవకాశం ఉంది. కేవలం కేంద్ర పెద్దలకు ఒప్పించి, నప్పించి సాయం అందుకోనున్నారు. అలాగని రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడరు కూడా. ఇప్పటికే బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రత్యేక హోదా సెగ పెట్టారు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీగా ఉంటూ.. పార్లమెంటులో గట్టిగా నిలదీయాలని డిసైడ్ అయ్యారు. కానీ చంద్రబాబు మాత్రం ఆ తరహా తప్పు చేసే అవకాశం లేదు.
ఏపీకి ప్రత్యేక హోదా కంటే అమరావతి,పోలవరం మాత్రమే చంద్రబాబుకు ప్రాధాన్యత అంశాలు. ఈ రెండింటికి మాత్రమే భారీగా నిధులు కోరే అవకాశం ఉంది. వీటికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందంటూ ఆయన పట్టు పట్టనున్నారు కూడా. ఏపీ విభజన చట్టం ప్రకారం చూసుకున్నా.. ఈ రెండు ప్రాజెక్టులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉంది. అందుకే ఈ రాష్ట్ర ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ చంద్రబాబు కేంద్రం పై ఒత్తిడి పెంచుతారు. బలవంతం మాత్రం చేయరు. ఇది బిజెపికి వాంఛనీయం కూడా. ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకుంది. 2014లో అధికారంలోకి వచ్చిన మోడీ విభజిత ఆంధ్ర ప్రదేశ్ కు ఏమీ చేయలేదన్న ఆగ్రహం బలంగా ఉంది.ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బిజెపి భాగస్వామ్య పక్షం కూడా. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలకం కూడా. చంద్రబాబు కోరుతున్నది విభజన హామీల్లో భాగమైన ప్రాజెక్టుల కోసమే. అందుకే మోదీ తప్పకుండా స్పందిస్తారు. అమరావతి రాజధాని కి ప్రత్యేక నిధులు కేటాయిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.