Kesineni Nani: విజయవాడలో మెట్రో ప్రాజెక్టును పట్టాలెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి రాజధాని నేపథ్యంలో.. ఒకవైపు రాజధాని ప్రాంతం.. ఇంకోవైపు గుంటూరు ను విస్తరిస్తూ ఈ మెట్రో రైలు ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ప్రజలకు రవాణా సదుపాయం మరింత మెరుగు పడనుంది. ప్రపంచస్థాయి నగరాల జాబితాలో విజయవాడ చేరనుంది. అయితే విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు మాజీ ఎంపీ కేశినేని నాని. మెట్రో రైలు ప్రాజెక్టుకు చేసిన ఖర్చుతో.. విజయవాడ ను మౌలిక వసతులపరంగా మెరుగుపరచవచ్చు కదా అని ఆయన సలహా ఇస్తున్నారు. మెట్రో రైల్ వద్దు.. విజయవాడ ను అభివృద్ధి చేసుకుందాం అంటూ పిలుపునిస్తూ ఒక ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పుడు మాజీ ఎంపీ వైఖరి పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. ఇది ప్రజల్లో ఒక రకమైన భావోద్వేగాన్ని రెచ్చగొట్టడమే అనే టాక్ వినిపిస్తోంది.సహజంగానే ప్రజలకు వసతుల విషయంలో సానుకూల భావన ఉంటుంది. మెట్రో రైలు ప్రాజెక్టు కంటే అభివృద్ధికి మొగ్గు చూపేవారు ఉంటారు. అటువంటి వారిని తన వైపునకు తిప్పుకోవడమే కేశినేని నాని లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే రాజకీయంగా ఇబ్బందుల్లో ఉన్న ఆయన ఈ తరహా ఉద్యమాన్ని ఎంచుకోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.
* టిడిపిలో చేరేందుకు..
ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో లేరు కేసినేని నాని. రెండుసార్లు విజయవాడ ఎంపీగా ఉండి మొన్నటి ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు.. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఫలితాలు వచ్చిన ఒకటి రెండు రోజుల్లోనే కీలక ప్రకటన చేశారు. తనకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదని చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని కూడా ప్రకటన చేశారు. కానీ అలా ఉండలేకపోతున్నారు. తిరిగి వైసిపిలోకి వెళ్లి యాక్టివ్ కాలేకపోతున్నారు. మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి వస్తానని వర్తమానం పంపుతున్నారు. తగిన సానుకూలత రాకపోవడంతోనే ఈ మెట్రో రైల్ ఉద్యమం ఎత్తుకున్నారు అనేది పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తున్న మాట.
* మంచి అవకాశం..
విజయవాడను ప్రపంచ స్థాయి నగరంగా నిలబెట్టేందుకు మెట్రో రైలు ఎంతగానో దోహదపడుతుంది. చెంతనే అమరావతి ఉండడం.. సమీపంలోనే గుంటూరు ఉండడంతో ఈ మెట్రో రైలు ప్రాజెక్టు పట్టాలెక్కితే ప్రజలకు రవాణా ప్రయోజనాలు అధికం. పైగా రవాణా రంగంలో అత్యంత మార్పులు సంతరించుకుంటుంది విజయవాడ. అటువంటి చోట మెట్రో రైలు ప్రాజెక్టులు వస్తే ఆహ్వానించాలి. పైగా మెట్రో ప్రాజెక్టుకు ఖర్చు చేసే మొత్తాన్ని విజయవాడ అభివృద్ధికి ఉపయోగించాలని సూచిస్తున్నారు కేశినేని నాని. అయితే మెట్రో ప్రాజెక్టుకు సాయం చేసే విదేశీ ఆర్థిక సంస్థలు. ఆపై ఈ ప్రత్యేక ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం కూడా సాయం అందిస్తూ వస్తుంది ప్రత్యేకంగా. ఈ నిధులను వేరే దానికి మళ్ళీ ఇస్తామంటే కుదరదు. ఈ విషయం ఎంపీగా పనిచేసిన కేసినేని నానికి తెలుసు. అయినా సరే అదే పనిగా మెట్రో రైలు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. పోరాటానికి సిద్ధపడుతున్నారు. అయితే ఇదంతా రాజకీయ పునరాగమనానికేనని విజయవాడ సర్కిల్స్ కు తెలుసు.