NTR: తెలుగుదేశంలో చంద్రబాబు తర్వాతే ఎవరూ అంటే మాత్రం చటుక్కున లోకేష్ పేరు వస్తుంది. ప్రస్తుతం ఆయన అనధికార అధినేత తెలుగుదేశం పార్టీకి. పైగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో అన్ని తానై వ్యవహరిస్తున్నారు. మొన్ననే జాతీయ కార్యవర్గాల ప్రకటనతో లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు చంద్రబాబు. అయితే మొన్నటి ఎన్నికలకు ముందు మాత్రం పార్టీ బాధ్యతల రేసులో జూనియర్ ఎన్టీఆర్ ఉండేవారు. 2019 ఎన్నికల్లో పార్టీకి దారుణ పరాజయం ఎదురు కావడంతో తరచూ జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపించేది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సన్నిహిత నేతలు ఇదే డిమాండ్ చేసేవారు. తెలుగుదేశం పార్టీ పై అభిమానం ఉండే నేతలు సైతం లో లోపల జూనియర్ ఎన్టీఆర్ రావాలని కోరుకునేవారు. కానీ లోకేష్ పని తీరు మెరుగుపడ్డాక ఈ అభిప్రాయం మారుతోంది తెలుగుదేశం పార్టీలో. లోకేష్ పార్టీ శ్రేణులకు దగ్గర అయ్యారు. పార్టీలో సీనియర్ నేతలతో పాటు జూనియర్లకు ఇప్పుడు లోకేష్ సమర్థవంతమైన నాయకుడిగా కనిపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ త్వరలో రాజకీయ పార్టీ ప్రారంభించబోతున్నారన్న చర్చ పొలిటికల్ వర్గాల్లో ఇటీవల వినిపించింది. కానీ దానిని ఖండించారు జూనియర్ ఎన్టీఆర్.
* ఆ ఇద్దరికీ రాయబారం..
అయితే తాజాగా రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం సాగుతోంది. చంద్రబాబు, లోకేష్ లతో జూనియర్ ఎన్టీఆర్ రాజీ పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రాయబారం కూడా పంపినట్లు సమాచారం. పార్టీకి తాను ఎప్పుడూ విధేయుడునని.. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నందున కొద్ది రోజులపాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని.. భవిష్యత్తులో లోకేష్ తో కలిసి పని చేస్తానని జూనియర్ ఎన్టీఆర్ తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని పంచుకున్నట్లు తెలుస్తోంది. ఇరు వర్గాల అనుకూలమైన వ్యక్తుల ద్వారా ఈ సమాచారం రాగా చంద్రబాబు తో పాటు లోకేష్ స్వాగతించినట్లు కూడా పొలిటికల్ వర్గాల్లో ప్రచారం ఉంది.
* లోకేష్ సానుకూలత..
లోకేష్ కోసమే జూనియర్ ఎన్టీఆర్ను పక్కన పెట్టారని అప్పట్లో ప్రచారం నడిచింది. కానీ దానిని ఎప్పుడూ ఖండించలేదు లోకేష్. ఆపై చంద్రబాబు కూడా జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ప్రత్యేక ప్రకటనలు చేయలేదు. పరస్పర అభినందనలు చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పుట్టినరోజులతో పాటు ప్రత్యేక ప్రస్తావనలు వచ్చినప్పుడు ఈ అభినందనలు కొనసాగాయి. అటు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో లోకేష్ సానుకూల ప్రకటనలు చేశారు. తారక్ వస్తే కచ్చితంగా స్వాగతం పలుకుతామని కూడా తేల్చి చెప్పారు. అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ విభేదిస్తున్నారు అంటూ ప్రచారం జరిగింది. సొంత పార్టీ పెట్టబోతున్నారంటూ కూడా హడావిడి నడిచింది. అది ముగిసి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాయబారం పంపించారని.. భవిష్యత్తులో లోకేష్ తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారని టాక్ నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.







