AP local elections: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన జాగ్రత్త పడుతోంది. లేనిపోని ప్రచారాలను పార్టీ శ్రేణులు నమ్మవద్దని కోరుతోంది. ఏకంగా జనసేన పోటీ చేసే స్థానాలు ఇవి అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలోనే అప్పుడే పార్టీలో అంతర్గత పోరు మొదలైంది. మచిలీపట్నం మేయర్ సీటు జనసేనకే కేటాయిస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో.. అక్కడ ఆశావహులుగా ఉన్న ఇద్దరు నేతల మధ్య అప్పుడే పోరు మొదలైంది. వ్యక్తిగత గొడవకు దారితీసింది. ప్రైవేటు కార్యక్రమంలోనే ఇరువర్గాలు కొట్టుకోవడం కనిపించింది. ఈ పరిస్థితుల్లో జనసేన ప్రత్యేక ప్రకటన చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మవద్దని కోరింది. పొత్తులో భాగంగా జనసేనకు స్థానిక సంస్థల పదవులు వస్తే అధికారికంగా ప్రకటిస్తామని తేల్చి చెప్పింది.
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి..
మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు, తరువాత కూటమి విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఎప్పటికప్పుడు జనసేన నాయకత్వం వాటికి బ్రేక్ వేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో జనసేన పోటీ చేయబోయే స్థానాలు ఇవి అంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు ప్రచారం చేయడం ప్రారంభించారు. ఇటీవల పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులతో సమావేశం జరిపి.. జనసేన బలానికి తగ్గట్టు స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యం పెంచుకుందామని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు స్థానిక సంస్థల కు సంబంధించి వ్యూహంపై 14 మంది నేతలతో కూడిన కమిటీని కూడా ప్రకటించారు. అప్పటినుంచి జనసేనలో ఒక రకమైన చేంజ్ కనిపించింది. ఈ తరుణంలో జనసేనతో పాటు కూటమిలో గందరగోళాన్ని సృష్టించేందుకు కొందరు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందుకే జనసేన నాయకత్వం స్పందించి ఈ నిర్ణయానికి వచ్చింది.
కూటమిలో గందరగోళం..
సార్వత్రిక ఎన్నికల మాదిరిగా కాదు.. జనసేన బలం పెరిగింది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ పదవులు జనసేనకే కేటాయించాలని సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. కనీసం 40 శాతం అంటూ పదవుల విభజన గురించి ప్రస్తావన జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కూటమిలో ఒక రకమైన గందరగోళం కనిపిస్తోంది. ఇది కూటమితో పాటు జనసేనకు నష్టం కలిగించే విషయమని.. జనసేన నాయకత్వం గుర్తించింది. అందుకే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని కోరుతూ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. మూడు పార్టీల మధ్య అంశం కావడం.. హై కమాండ్ పార్టీ బలం, ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకుంటుందని.. దీనిపై ఎవరూ మాట్లాడవద్దని.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నమ్మవద్దని జనసేన నాయకత్వం కోరడం విశేషం.