Kondagattu: కొలిస్తే కోరినంత వరం ఇచ్చే దేవుడిగా కొండగట్టు అంజన్నకు పేరుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మల్యాల మండలం కొండగట్టులో ఆంజనేయస్వామి స్వయంభు గా వెలిశాడు. ఈ క్షేత్రానికి ఎంతో చారిత్రాత్మకమైన పేరు ఉంది. బలమైన నేపథ్యం కూడా ఉంది. అందువల్లే ఈ ఆలయాన్ని మహిమాన్విత క్షేత్రం లాగా పేర్కొంటుంటారు.
కొండగట్టు అంజన్న స్వామి ఆలయాన్ని ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. వేములవాడకు వచ్చే భక్తులు.. రాజన్నను దర్శించుకున్న తర్వాత.. అంజన్న స్వామి దగ్గరికి వెళ్తుంటారు. బస్సులో కొండమీదికి వెళ్లడం అద్భుతమైన అనుభూతి. వర్షాకాలంలో ఇక్కడ చెట్లు పచ్చగా మారుతాయి. ఆ సమయంలో బస్సు మార్గంలో కొండకు వెళ్లడం భక్తులకు అద్భుతమైన ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. మిగతా కాలాలతో పోల్చి చూస్తే వర్షాకాలంలో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా వస్తూ ఉంటారు.
కొండగట్టు ఆంజనేయ స్వామికి కోరిన వరాలు ఇచ్చే దేవుడిగా పేరుంది. ఈ స్వామివారికి పూజలు చేసిన అనంతరం భక్తులు హుండీలో కానుకలు సమర్పిస్తూ ఉంటారు. గతంలో ఎన్నడు కూడా కొండగట్టు అంజన్న స్వామి ఆలయానికి సంబంధించిన హుండీల విషయంలో వివాదం ఏర్పడలేదు. కానీ తొలిసారి ఆంజనేయస్వామి ఆలయానికి సంబంధించి హుండీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆంజనేయస్వామి హుండీలలో కొందరు వ్యక్తులు నకిలీ నోట్లు వేయడం కలకలం రేపుతోంది.. ఇక్కడి స్వామివారిని భక్తులు దర్శించుకున్న తర్వాత.. తమ మదిలో ఉన్నంత నగదు లేదా బంగారం లేదా వెండి ఆభరణాలను అందులో వేస్తారు. కొందరైతే విదేశీ కరెన్సీ కూడా అందులో వేస్తారు. అయితే ఈసారి హుండీలలో ఉన్న నగదును అధికారులు లెక్కించారు. ఇలా నగదు లెక్కిస్తున్న క్రమంలో అందులో ఐదు నకిలీ 500 నోట్ల కట్టలు బయటపడ్డాయి. దీంతో అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. గతంలో ఎన్నడు ఇలా జరగలేదని.. నకిలీ నోట్లు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తాం గాని అక్కడి అధికారులు చెబుతున్నారు..
ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చిన హుండీలను తాజాగా లెక్కించడం ద్వారా ఒక కోటి 62 లక్షల పదహారువేల 621 రూపాయల నగదు వచ్చింది. 80 రోజులకు గాను ఈ స్థాయిలో నగదు లభించింది అని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం ఈవో అంజన రెడ్డి పేర్కొన్నారు. కాకపోతే ఈసారి ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలలో 500 రూపాయలకు సంబంధించిన ఐదు కట్టలు నకిలీవని.. దీనికి సంబంధించి ఉన్నతాధికారులకు నివేదించామని.. అంజనా రెడ్డి పేర్కొన్నారు. కొండగట్టు ఆలయ చరిత్రలో ఇంతవరకు నకిలీ నోట్లు వచ్చిన దాఖలాలు లేవు. కానీ ఈసారి నకిలీ నోట్ల కట్టలు కనిపించడం ఆందోళన కలిగిస్తోందని ఇక్కడి భక్తులు చెబుతున్నారు.