CM Jagan: జగన్ పక్క వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ప్రతిపక్షాలు కూటమి కట్టడంతో.. గట్టి ఫైట్ ఉంటుందని అంచనా వేశారు. అందుకే పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చి వ్యతిరేకతను తగ్గించుకోవాలని చూస్తున్నారు. మరోవైపు సామాజిక కోణాన్ని తెరపైకి తీసుకువచ్చి విపక్షాల ప్రయత్నాలను గండి కొట్టాలని చూస్తున్నారు. బీసీలతో పాటు మైనారిటీలకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యమిచ్చా రు. కూటమి పార్టీలు తనను అందనంత దూరంలో జగన్ నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బీసీలకు పెద్ద ఎత్తున టికెట్లు కేటాయించడం విశేషం. అందులో దాదాపు అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అణగారిన వర్గాలకు,ముస్లిం, మైనారిటీలకు రాజకీయ ప్రాధాన్యం వచ్చింది. ఎంతోమంది బీసీ నాయకులు పుట్టుకొచ్చారు. నాయకులను తయారు చేసే ఫ్యాక్టరీగా టిడిపి మారింది. అయితే అప్పట్లో ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీగా ఉండగా.. జాతీయ పార్టీగా కాంగ్రెస్ ఉండేది. టిడిపి పెద్దఎత్తున బీసీలకు టికెట్లు కేటాయించి వారి అభిమానాన్ని పొందగలిగింది. టిడిపి తో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించడానికి వీలు లేకపోయేది. జాతీయ పార్టీ కావడంతో రకరకాల సమీకరణల మూలంగా పెద్ద ఎత్తున బీసీలకు టికెట్లు కేటాయించే పరిస్థితి ఉండేది కాదు. కానీ టిడిపి క్రమేపి ఆ పద్ధతిని పాటించి సక్సెస్ అయింది. ఇప్పుడు అదే ఫార్ములాను జగన్ అనుసరిస్తున్నారు.
తాజాగా వైసిపి ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 41 మంది బీసీ అభ్యర్థులను ప్రకటించారు. ఇక పార్లమెంట్ స్థానాలకు సంబంధించి 11 మంది బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారు.టిడిపి తరువాత అంత భారీ స్థాయిలో బీసీలకు టికెట్లు కేటాయించడం ఇదే మొదటి సారి.అయితే తెలుగుదేశం పార్టీ సింగిల్ గా పోటీ చేసి ఉంటే పెద్ద ఎత్తున బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చేది. కానీ ఇప్పుడు కూటమితో కలిసి వెళుతుండడం.. మూడు పార్టీలకు సర్దుబాటు చేయాల్సి రావడంతో బీసీలకు ఎక్కువ శాతం టికెట్లు ఇచ్చే ఛాన్స్ లేదు. ఇప్పటివరకు ప్రకటించిన 128 మంది అభ్యర్థుల్లో టిడిపి బీసీలకు కేటాయించింది కేవలం 24 మాత్రమే.. ఇంకా చేతిలో ఉన్నవి 16 స్థానాలు మాత్రమే. అందులో బీసీలకు ఎన్ని ఇస్తారు? అన్నది తెలియాల్సి ఉంది. అందుకే ఇక్కడ జగన్ మాస్టర్ స్ట్రోక్ వేశారు. ఏకంగా అసెంబ్లీ స్థానాలకు 44 మంది,పార్లమెంట్ స్థానాలకు 11 మంది బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చి విపక్షాలకు గట్టి దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. మరి జగన్ ప్రయత్నాలు ఎన్నికల్లో ఎంతవరకు ఫలితం ఇస్తాయో చూడాలి.