Pawan Kalyan Nara Lokesh: ఏపీలో( Andhra Pradesh) అన్నదమ్ములు మాదిరిగా కలిసి నడుస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు కృషి చేస్తుంటే.. అందుకు రక్షణ కవచంలా నిలుస్తున్నారు ఈ ఇద్దరు నేతలు. వారు నడవడమే కాదు తమ పార్టీ లీడర్లను, క్యాడర్లను కూడా నడిపిస్తున్నారు. తమ కలయికతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారు. అందుకే తమ రాజకీయ స్నేహాన్ని మరి కొన్నేళ్లపాటు ఇలానే కొనసాగించాలని ఆశపడుతున్నారు. అయితే అనుకుంటే కుదరదు. తమ మధ్య బంధాన్ని మరింత దృఢం చేసుకోవడం ద్వారా ఇరు పార్టీలకు మంచి సంకేతాలు ఇవ్వాలని చూస్తున్నారు. ఈ 20 నెలల కాలంలో పవన్ కళ్యాణ్, లోకేష్ మధ్య చిచ్చు పెట్టేందుకు వైసిపి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఇలా ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి ఆ ఇద్దరి నేతల మధ్య బంధం పెరుగుతూనే ఉంది. ఎంతలా అంటే అంబుజా సిమెంట్ యాడ్ మాదిరిగా..
చంద్రబాబుకు అండగా..
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చంద్రబాబు( CM Chandrababu) కంటూ ఒక పేజీ ఉంది. అదే మాదిరిగా తమకంటూ అలానే ఉండాలని పరితపిస్తున్నారు పవన్ కళ్యాణ్, లోకేష్. పెద్దాయనకు అండగా నిలుస్తూనే.. తమ పని తాము చేస్తున్నారు. ప్రభుత్వపరంగా, కూటమిపరంగా, తమ పార్టీల పరంగా కలిసి ముందుకు సాగుతున్నారు ఈ ఇద్దరు నేతలు. ఈ క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులను సైతం అధిగమిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అనే బండిని చంద్రబాబు ముందుకు తీసుకెళ్తుండగా.. ఆ ఇద్దరూ ఇరుసులుగా ఉంటున్నారు.
సొంత కుటుంబ సభ్యులు మాదిరిగా..
కుటుంబ బంధాలే చీలిపోతున్నాయి. రక్తసంబంధీకులే బద్ధ శత్రువులు అవుతున్నారు. ఆధిపత్యం కోసం తొడబుట్టిన వారే విభేదించుకుంటున్నారు. అంతెందుకు ఏపీలో వైయస్ కుటుంబం, తెలంగాణలో కల్వకుంట్ల ఫ్యామిలీ ఎలా రచ్చకు ఎక్కాయో తెలియనిది కాదు. అటువంటిది పవన్ కళ్యాణ్, లోకేష్ మధ్య బాండింగ్ రోజురోజుకు పెరుగుతోంది తప్ప.. ఎంత మాత్రం తగ్గడం లేదు. పవన్ కళ్యాణ్, లోకేష్ మధ్య బంధం రాజకీయాలను దాటి.. పదవులను అధిగమించి ముందుకు సాగుతోంది.
ఒకరి కోసం ఒకరు..
సాధారణంగా రాజకీయ పార్టీ అంటేనే లక్షలాదిమంది సమూహం. అటువంటిది టిడిపి, జనసేన ను కలిసికట్టుగా ఉంచడానికి ఒకరి కోసం ఒకరు తగ్గుతున్నారు. ఒకరి కోసం మరొకరు నిలబడుతున్నారు పవన్ కళ్యాణ్, లోకేష్. ప్రత్యర్థి పార్టీ రాజకీయ ఉచ్చులో చిక్కుకోకుండా నెగ్గుతున్నారు. లోకేష్ కు కూడా డిప్యూటీ సీఎం.. ఇక పవన్ అధికారం నామ మాత్రమే అని ప్రచారం చేశారు. కూటమిలో నిప్పు పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. అయినా కూడా మేము ఒక్కటే.. కూటమి ప్రభుత్వం ఉమ్మడి కుటుంబం మాదిరి మరో 15 సంవత్సరాలు పాటు కలిసే ఉంటుంది. కలిసే సమస్యలు పరిష్కరించుకుంటాం అని ఇద్దరు నేతలు చెబుతున్న తీరు పొలిటికల్ హిస్టరీలో సరికొత్త మాట. రోజురోజుకు వీరి మధ్య బలపడుతున్న బంధం కూటమి ఐక్యతను చాటి చెప్పగా.. వైసీపీ శ్రేణులకు మాత్రం మింగుడు పడడం లేదు.