Ambati Rambabu Granted Bail: ఏపీలో( Andhra Pradesh) కీలక రాజకీయ పరిణామం. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు అయింది. గత కొద్ది రోజులుగా ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. తిరుమలలో లడ్డు కల్తీ వివాదానికి సంబంధించి వైసిపి ఆందోళన కార్యక్రమంలో అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఇప్పటికే ఆ కేసులో అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చింది. కానీ గత ఏడాది నవంబర్ 12న పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో ఈరోజు బెయిల్ వచ్చింది గుంటూరు ఎక్సైజ్ కోర్టు నుంచి. ఆయనపై పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ సైతం కొట్టివేతకు గురైంది. దీంతో అంబటి రాంబాబు పై నమోదైన కేసులకు సంబంధించి అన్ని కోర్టులు బెయిల్ ఇవ్వడంతో రేపు జైలు నుంచి అంబటి విడుదల అయ్యే అవకాశం ఉంది.
సీఎంపై అనుచిత వ్యాఖ్యలతో..
గత నెల 31న సీఎం చంద్రబాబుపై( AP CM Chandrababu) అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అంబటి రాంబాబు అరెస్టు జరిగింది. కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో రెండు రోజుల కిందట గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే గత ఏడాది నవంబర్ 12న ప్రభుత్వ మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. గుంటూరులో అంబటి రాంబాబు నేతృత్వంలో ఆందోళనలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమ విధులకు ఆటంకం కలిగించారు అంటూ అంబటి రాంబాబు పై పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులు ఆయనకు విముక్తి లభించింది. కానీ ఈ కేసులో బెయిల్ లభించకపోవడంతో విడుదల కాలేదు. కానీ ఈరోజు అంబటికి బెయిల్ తో పాటు పోలీసులు వేసిన పిటీషన్ సైతం డిస్మిస్ చేసింది కోర్టు. దీంతో రేపు జైలు నుంచి అంబటి విడుదలయ్యే అవకాశం ఉంది.
గత 12 రోజులుగా..
గత 12 రోజులుగా అంబటి రాంబాబు( ambati Rambabu) జైల్లో ఉన్నారు. అయితే ఆయనను కాపు టైగర్ అంటూ జగన్మోహన్ రెడ్డి కీర్తించడం పై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. వైసిపి కాపుల్లో ఒక రకమైన చీలిక తేవాలని ప్రయత్నించింది అంబటి అరెస్టుతో. కానీ ఇది పెద్దగా వర్కౌట్ కాలేదు. రాష్ట్రవ్యాప్తంగా కాపుల ద్వారా రాజకీయం చేయాలని చూశారు జగన్. అందులో భాగంగా విశాఖ నుంచి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో సంఘీభావ యాత్ర చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి భారీ జన సమీకరణ నడుమ గుంటూరులో అంబటి రాంబాబు ఇంటిని సందర్శించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇప్పుడు అంబటి రాంబాబుకు బెయిల్ లభించడంతో ఆయనకు స్వాగతం పలికేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి బలప్రదర్శనకు దిగే అవకాశం ఉంది.