Homeఆంధ్రప్రదేశ్‌Vangalapudi Anita : ఈనాడులో కనిపించేందుకు అంతలా రామోజీ భజన అవసరమా?

Vangalapudi Anita : ఈనాడులో కనిపించేందుకు అంతలా రామోజీ భజన అవసరమా?

Vangalapudi Anita : మార్గదర్శి కేసులో మీడియా మొఘల్ రామోజీరావు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జగన్ సర్కారు వెంటాడుతోంది. వేటాడినంత పనిచేస్తోంది. కానీ రామోజీ అండ్ కో నుంచి మేకపోతు గాంభీర్యం కనిపిస్తోంది. తన మీడియాతో ఏదైనా చేయవచ్చన్న ఆలోచనతో దర్యాప్తు సంస్థపైనే కథనాలు వండి వార్చుతున్నారు. దీనికి టీడీపీ నేతలు వత్తాసు పలుకుతున్నాయి. అయితే పేరు మోసిన నాయకులు, రామోజీ విషయం గుర్తెరిగిన నాయకులు పెద్దగా స్పందించడం లేదు. కానీ మీడియా పిచ్చి ఉన్నవాళ్లు మాత్రం ముందుకొచ్చి రామోజీరావును వెనుకేసుకొస్తున్నారు. దీంతో ఈనాడులో పతాక శీర్షికలో కనిపిస్తామన్న ఆత్రం ఉన్న నాయకులు పనిగట్టుకొని ముందుకొస్తున్నారు. అటువంటి వారిలో తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఉన్నారు.

ఈ కేసుకు సంబంధించి సీఐడీ చీఫ్ సంజయ్ ప్రెస్ మీట్ పెట్టారు. చందాదారులకు మార్గదర్శి యాజమాన్యం వడ్డీ సక్రమంగా చెల్లిస్తోంది కదా అని విలేఖర్లు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన సంజయ్ మాట్లాడుతూ బాలికలకు బిస్కెట్లు, చాక్లెట్లు ఆశచూపి అత్యాచారం చేసినట్టు.. మార్గదర్శి వడ్డీ ఆశచూపి చందాదారులను మోసం చేసిందని చెప్పుకొచ్చారు. ఆ మాట బయటకు వచ్చిన నాటి నుంచి అనిత తన కురచ బుద్ధిని చూపారు. సీఐడీ చీఫ్ అత్యాచారాల గురించి మాట్లాడినట్టు చాలా అసహ్యకరమైన రీతిలో వ్యాఖ్యానాలు చేస్తున్నారు. అత్యాచారానికి గురైన బాలికలు చాక్లెట్లు, బిస్కెట్లకు ఆశపడి అంగీకరిస్తున్నారని అనిత వక్రభాష్యం చెబుతున్నారు.

మార్గదర్శి మోసాలు ఏ తరహాలో ఉన్నాయని చెప్పే క్రమంలో సీఐడీ చీఫ్ మాట్లాడారు.కానీ దానిని మరిచి.. రెండో పార్శ్యాన్ని చూపి వివాదం చేయాలని అనిత చూస్తున్నారు. అత్యాచారానికి గురైన బాలిక మానసిక స్థితి ఎలా ఉంటుందో తెలుసునా? అంటూ మీ ఇళ్లలో మహిళలు, బాలికలు లేరా అని ప్రశ్నిస్తున్నారు. చందాదారులంతా అత్యాచారానికి గురైన వారేనా? మార్గదర్శిలో పనిచేస్తున్న వారంతా అత్యాచారం చేసేవారేనా? అంటూ అర్ధం పర్థం లేని మాటలతో సీఐడీ చీఫ్ మీద విరుచుకుపడుతున్నారు. అసలు కేసుకు సంబంధం లేని మాట్లాడుతూ బురదజల్లే పనిలో ఉన్నారు.

మార్గదర్శి కేసు అనగానే ఈనాడు మీడియాలో కవరేజ్ లభిస్తుంది. చాలా మంది జిల్లాలో పట్టుకోల్పోయిన నాయకులు ఇప్పుడు మార్గదర్శి కేసుపైనే మాట్లాడుతున్నారు. అటు రామోజీరావు ప్రాపకం తో పాటు ఈనాడు వార్తల్లో కవరేజ్ లభిస్తుందని ఎక్కువ మంది నేతలు ఆశిస్తున్నారు. వాస్తవానికి మార్గదర్శిపై అభియోగాలు మోపి సీఐడీ విచారణ చేపడుతోంది. దీనిపై రామోజీ అండ్ కో న్యాయ పోరాటం చేస్తోంది. ఇంకా తప్పు జరిగిందని తేలలేదు. కానీ ప్రజల్లో అయోమయాన్ని సృష్టించేందుకు ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు అని ప్రచారం చేసి టీడీపీ నాయకులు మీడియాలో కనిపించి ఆనందం పొందుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular