Pulivendula Municipality Elections: రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యక్ష పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని దానికి సంబంధించిన కార్యాచరణ మొదలుపెట్టారు. 16వ ఆర్థిక సంఘం నిధులు రావాలంటే కచ్చితంగా కార్యవర్గాలు ఉండాలి. లేకుంటే వేలకోట్ల రూపాయలు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ లోగా ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. విలీన గ్రామాలు, పంచాయతీలు, వార్డుల సర్దుబాటు విషయంలో న్యాయ చిక్కు ముళ్ళు వస్తే వాటిని విడిచిపెట్టి మరి మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు అయితే ఒప్పుకోను అంటూ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ శ్రేణులకు చెప్పిన సంగతి తెలిసిందే. కానీ తన సొంత పులివెందుల మున్సిపాలిటీ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.
* జడ్పిటిసి ఎన్నికల్లో ప్రతికూల ఫలితం..
మొన్ననే పులివెందుల జడ్పిటిసి బైపోల్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదు. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ప్రభుత్వం అధికారాన్ని ఉపయోగించి అడ్డదారిలో విజయం దక్కించుకుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. కానీ ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయడంతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పులివెందులలో ఓటమి ఎదురైందని కూటమి ఆరోపించింది. పులివెందులలో స్వేచ్ఛగా ఓటింగ్ జరిగితే వైయస్సార్ కుటుంబ పరిస్థితి ఇది అని తేల్చి చెప్పింది. అయితే ఇప్పుడు అదే పులివెందుల మున్సిపాలిటీ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి నిలిచిపోయేలా చేయడం ఆశ్చర్యం వేస్తోంది. కచ్చితంగా ఇది ఓటమి భయంతోనేనని అధికార పక్షం ఆరోపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవాలు జరిగితే గట్టి చర్యలు తీసుకుంటానని హెచ్చరించారని.. కానీ తన సొంత నియోజకవర్గ పులివెందులలో మాత్రం కుంటి సాకులు వెతుక్కుంటూ ఎన్నికలు నిలిపివేసేందుకు ప్రయత్నిస్తున్నారని కూటమి ఆరోపిస్తోంది.
* ఆ విషయాన్ని గ్రహించి..
కచ్చితంగా పులివెందుల మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు అధికార టీడీపీ కూటమి ప్రయత్నిస్తుంది. అది ఏ స్థాయిలో జరుగుతుందో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలియంది కాదు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేసిందో ప్రజలందరికీ తెలుసు. పైగా పులివెందుల లాంటి మున్సిపాలిటీలో ప్రతికూల ఫలితాలు వస్తే దాని ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుందో జగన్మోహన్ రెడ్డి ఊహించి ఉంటారు. ఇప్పటికే బీటెక్ రవి రంగంలోకి దిగిపోయారు. గతంలో కుప్పం మున్సిపాలిటీని గెలిచిన తరువాత మాత్రమే చంద్రబాబును ఓడిస్తామని వైసిపి నేతలు శపధం చేశారు. వై నాట్ కుప్పం అన్న నినాదాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు కానీ పులివెందుల మున్సిపాలిటీని ఓడిపోతే వై నాట్ పులివెందుల అనే నినాదం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అందుకే ఈ అడ్డగింతలు అని కూటమి అనుమానిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.