Homeఆంధ్రప్రదేశ్‌Ganta Srinivasa Rao: గంటా ఒత్తిడికి తలొగ్గిన చంద్రబాబు

Ganta Srinivasa Rao: గంటా ఒత్తిడికి తలొగ్గిన చంద్రబాబు

Ganta Srinivasa Rao: సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు అనుకున్నది దక్కించుకున్నారు. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ మేరకు టిడిపి హై కమాండ్ ఆయన పేరును ప్రకటించింది. దీంతో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలకు తెరపడింది. గంటా శ్రీనివాసరావు తరచూ నియోజకవర్గాలను మారుతుంటారు. 1999 నుంచి ఇదే ఫార్ములాను అనుసరిస్తూ గెలుపు బాట పడుతూ వస్తున్నారు.ఈ ఎన్నికల్లో కూడా అలానే కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ టిడిపి ప్రకటించిన మూడు జాబితాల్లో ఆయన పేరు ప్రకటించలేదు. దీంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. అయినా సరే తనకు తప్పకుండా టిక్కెట్ వస్తుందని ధీమాతో ఉండేవారు. అందుకు తగ్గట్టుగానే టిడిపి నాలుగో జాబితాలో భీమిలి అసెంబ్లీ సీటును ఆయనకు కేటాయిస్తూ హైకమాండ్ ప్రకటించింది.

గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు విజయం సాధించారు. కానీ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో కొద్దిరోజులపాటు గంటా సైలెంట్ అయ్యారు. టిడిపిలో యాక్టివిటీస్ ను తగ్గించారు. ఒకానొక దశలో వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో ఉత్తరాంధ్ర రీజియన్ కోఆర్డినేటర్ గా ఉన్న విజయసాయిరెడ్డి అడ్డుకున్నట్లు ప్రచారం జరిగింది. గంటా వస్తే తనకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కావడం తప్పదని భావించి అప్పటి మంత్రి అవంతి శ్రీనివాస్ సైతం అడ్డు చెప్పినట్లు ప్రచారం జరిగింది. అయితే గత ఏడాదిగా మళ్లీ టీడీపీ కార్యక్రమాల్లో గంటా యాక్టివ్ అయ్యారు. లోకేష్ పాదయాత్ర తో పాటు చంద్రబాబు కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే అదంతా టిడిపి టికెట్ కోసమేనని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనవిశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాలతో పాటు భీమిలి నియోజకవర్గంలో ఏదో ఒక చోట సర్దుబాటు చేయాలని చంద్రబాబును కోరారు. కానీ చంద్రబాబు చీపురుపల్లి వెళ్లాలని సూచించారు. అందుకు గంటా శ్రీనివాసరావు సుముఖత చూపలేదు. భీమిలి టిక్కెట్ కావాలని పట్టుబట్టారు. దీంతో మరోసారి చంద్రబాబు ఆ నియోజకవర్గంలో సర్వే చేపట్టారు. గంటా శ్రీనివాసరావుకు సానుకూలత రావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయనను అభ్యర్థిగా ప్రకటించారు.

1999 నుంచి గంటా శ్రీనివాసరావు అప్రతిహసంగా గెలుపొందుతూ వచ్చారు. ప్రతి ఎన్నికలోను విజయం సాధిస్తూ వచ్చారు. 1999లో తొలిసారిగా అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2004లో చోడవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2009లో మాత్రం ప్రజారాజ్యం పార్టీలోకి మారారు. అనకాపల్లి అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టిడిపిలోకి రీఎంట్రీ ఇచ్చారు. భీమిలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2019లో మళ్లీ టీడీపీ నుంచి విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.పార్టీ ఏదైనా,నియోజకవర్గం ఏదైనా గెలుపొందుతూ రావడం గంటా శ్రీనివాసరావు ప్రత్యేకత. అందుకే చంద్రబాబు సైతం గంటాను వదులుకోవడానికి ఇష్టపడలేదు. ఆయన కోరుకున్న భీమిలి అసెంబ్లీ సీటును కట్టబెట్టారు. దీంతో గంటా శ్రీనివాసరావు అనుకున్నది సాధించుకోగలిగారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular