Homeఆంధ్రప్రదేశ్‌Killi Krupa Rani: అవమానంతో వైసీపీని వీడిన ఆ కేంద్ర మాజీ మంత్రి

Killi Krupa Rani: అవమానంతో వైసీపీని వీడిన ఆ కేంద్ర మాజీ మంత్రి

Killi Krupa Rani: కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి ఒక వెలుగు వెలిగారు. అయితే రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో కనుమరుగైంది. అయినా సరే కాంగ్రెస్ పార్టీలోనే ఆమె కొనసాగారు. అయితే గత ఎన్నికల ముందు కృపారాణికి ఏవేవో భ్రమలు కల్పించి వైసీపీలోకి తీసుకెళ్లారు. కానీ గత ఐదేళ్లుగా ఆమెకు అవమానాలు ఎదురయ్యాయి. ఎక్కడా పదవులు పలకరించలేదు. వైసీపీలో ఆలస్యంగా చేరినందుకు ఆమె మూల్యం చెల్లించుకున్నారు. ఆమెకు జగన్ పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు. దీంతో ఆమె గౌరవం లేని చోట ఉండలేనంటూ చెబుతూ.. తన పూర్వశ్రమమైన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తున్న పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరారు.

కృపారాణిని వైసీపీలో చేర్చుకునే సమయంలో చాలా రకాల హామీలు ఇచ్చినట్లు ఆమె స్వయంగా చెప్పుకొచ్చారు. క్యాబినెట్ హోదా తో సమానమైన పదవి ఇచ్చి గౌరవిస్తామని.. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి మీ పేరు పరిశీలిస్తున్నట్లు స్వయానా విజయసాయిరెడ్డి చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి వైసిపిలో చేరారు. అయితే ఆమె రాక సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఇష్టం లేదని అప్పట్లోనే ప్రచారం జరిగింది. అయితే కృపారాణి ఇలా వైసీపీలో చేరారో లేదో.. ఆమెకు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి అప్పగించారు. దీంతో ఆమె తిరుగు లేదని భావించారు. పార్టీలో కీలక పోస్టు తప్పకుండా లభిస్తుందని అంచనా వేశారు. కానీ ఉన్నపలంగా ఆమె వద్ద ఉన్న పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని తొలగించారు. సీనియర్ నేత ధర్మాన కృష్ణ దాస్ కు అప్పగించారు. అయితే శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా తన పేరును ప్రకటిస్తారని కృపారాణి ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆమె కంటే జూనియర్ అయిన పేరాడ తిలక్ పేరు ప్రకటించేసరికి ఆమె మైండ్ బ్లాక్ అయింది. ఎంత మాత్రం వైసీపీలో ఉండడం శ్రేయస్కరం కాదని భావించి ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో గత ఐదు సంవత్సరాలుగా జరిగిన అవమానాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. నేరుగా షర్మిల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.

రాజకీయాలకు రాకముందు డాక్టర్ కిల్లి కృపారాణి వైద్య రంగంలో రాణించారు. ఆమెలో ఉన్న నాయకత్వ లక్షణాలను గుర్తించిన రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి ఆహ్వానించారు. 2003లో శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేసిన సమయంలో కృపారాణి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. అప్పటికే నాలుగు సార్లు శ్రీకాకుళం ఎంపీగా గెలిచిన కింజరాపు ఎర్రం నాయుడు కు గట్టి పోటీ ఇచ్చారు. 2004 ఎన్నికల్లో ఓడిపోయినా 2009కి వచ్చేసరికి సర్వశక్తులు ఒడ్డారు. ఎర్రం నాయుడును ఓడించి జైంట్ కిల్లర్ గా నిలిచారు. యూపీఏ 2 ప్రభుత్వంలో సహాయ మంత్రి పదవి పొందగలిగారు. 2014 రాష్ట్ర విభజన వరకు కృపారాణి రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. అయితే రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. అయినా సరే కృపారాణి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు ఆమెతో చర్చించి పార్టీలోకి తీసుకెళ్లారు. కానీ ఒక్క పదవి కూడా ఇవ్వకుండా ఆమెను హోల్డ్ లో పెట్టారు. అందుకే ఆమె తన పూర్వశ్రమమైన కాంగ్రెస్ గూటికి చేరారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular