India Today Survey: ప్రాంతీయ మీడియాను పక్కన పెడితే.. అధికారంలో ఉన్న పార్టీలు జాతీయ మీడియాకు సాగిల పడుతుంటాయి. అవి నిర్వహించే సదస్సులకు స్పాన్సర్స్ చేస్తుంటాయి.. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇండియా టుడే, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి మీడియా యాజమాన్యాలు సదస్సులు నిర్వహిస్తే ప్రభుత్వపరంగా స్పాన్సర్ చేశారు. ప్రత్యేకంగా జీవోలు విడుదల చేసి వారికి సహకరించారు. అయితే చంద్రబాబు సహకరించిన తర్వాత మాత్రాన ఆ మీడియా యాజమాన్యాలు ఆయన గెలుస్తాడు అని చెప్పలేదు. పైగా చంద్రబాబుతో పాటు ఇతర విపక్ష నాయకులను కూడా ఆ సమావేశానికి పిలిచాయి. చంద్రబాబు పాలన.. కొన్ని వైఫల్యాలు.. సాధించిన విజయాలు.. ఇతర సమస్యల మీద అప్పట్లో రాజ్దీప్ సర్దేశాయ్ చంద్రబాబు నాయుడుని ఇంటర్వ్యూ చేశారు. ఇదే తరహాలో జగన్మోహన్ రెడ్డి, ఇతర విపక్ష నాయకులను కూడా ఇంటర్వ్యూ చేశారు. అయితే అప్పట్లో ఏపీలో ప్రభుత్వ మారుతుందని ఇండియా టుడే నుంచి మొదలుపెడితే టైమ్స్ ఆఫ్ ఇండియా వరకు చెప్పింది. చెప్పినట్టుగానే అక్కడ జగన్ అధికారంలోకి వచ్చారు.
త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జాతీయ మీడియా సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక సర్వే ఫలితాన్ని విడుదల చేసింది. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైఎస్ఆర్సిపి భారీగా పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటుందని ప్రకటించింది. దీంతో చంద్రబాబు అనుకూల మీడియా తెగ గింజుకుంది. టైమ్స్ ఆఫ్ ఇండియాకు జగన్ మోహన్ రెడ్డి ఏడు కోట్లు ఇచ్చారు కాబట్టే ఆయనకు అనుకూలంగా ప్రచారం చేస్తోందని ఆరాపించింది.. కానీ ఇదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా కు సదస్సులు నిర్వహిస్తోంది అనే పేరుతో డబ్బులు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా జీవోలు కూడా విడుదల చేయించారు. మరి అప్పట్లో కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా చంద్రబాబు నాయుడు గెలుస్తాడు అని చెప్పలేదు. ఆయన పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పలేదు. మరి అప్పుడు చంద్రబాబు డబ్బులు ఇచ్చిన విషయాన్ని ఆయన అనుకూల మీడియా దాచి పెట్టింది. పైగా టైమ్స్ ఆఫ్ ఇండియా జగన్ జేబు పత్రిక అయిపోయిందని నానా రచ్చ చేసింది.
ఇక ఇప్పుడు తాజాగా ఇండియా టుడే కాన్ క్లేవ్ పేరుతో తిరుపతిలో రెండు రోజులపాటు సదస్సులు నిర్వహించనుంది. దీనికయ్యే ఖర్చు మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం భరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొంటున్నారని తెలుస్తోంది. ఇండియా టుడే రెసిడెంట్ ఎడిటర్ రాజ్ దీప్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారని సమాచారం. అయితే దీనిపై చంద్రబాబు అనుకూల మీడియా అడ్డగోలు వాదనలకు దిగుతోంది. జగన్ ప్రభుత్వం జాతీయ మీడియాకు అడ్డగోలుగా దోచిపెడుతున్నారని కథనాలు రాయడం ప్రారంభించింది. జగన్ అడ్డగోలుగా డబ్బులు ఇవ్వడం వల్లే జాతీయ మీడియా ఆయనకు అనుకూలంగా వార్తలు రాస్తోందని విమర్శించడం మొదలుపెట్టింది. అయితే సాధారణంగా జాతీయ మీడియా సంస్థలు సదస్సులు నిర్వహించేప్పుడు అందర్నీ పిలుస్తాయి. మీ ప్రభుత్వానికి ఆమోదయోగ్యం అయితేనే స్పాన్సర్ చేయండి అని అడుగుతాయి. అంత తప్ప బలవంతంగా డబ్బులు తీసుకోవు. సరే తెర వెనుక ఏం జరుగుతాయో తెలియదు కానీ.. సదస్సుల పేరుతో నిర్వహించే కార్యక్రమాల విషయంలో మాత్రం జాతీయ మీడియా సంస్థలు నిక్కచ్చిగా వ్యవహరిస్తాయి. ఇండియా టుడే సదస్సు ప్రారంభం కాకముందే ఆరమ్మ ఘోరాలు పోతున్న చంద్రబాబు అనుకూల మీడియా.. రేపటి నాడు ఇండియా టుడే కూడా జగన్ అనుకూలంగా సర్వే తీర్పు ఇస్తే ఎలాంటి ప్రచారం చేస్తుందో మరి? అన్నట్టు ఈ సదస్సుకు చంద్రబాబు నాయుడు కూడా హాజరవుతున్నారని ఇండియా టుడే వర్గాలు చెబుతున్నాయి