AP Elections 2024: ఏపీలో ఇప్పుడు గాజు గ్లాస్ గుర్తు వివాదంగా మారింది. జనసేన గుర్తు ను ఇండిపెండెంట్ లకు కేటాయించడమే ఇందుకు కారణం. జనసేన పోటీలో లేని చోట..అది కూడా ప్రత్యర్థులు బలంగా ఉన్నచోట మాత్రమే ఇండిపెండెంట్ లకు ఈ గుర్తు రావడం విశేషం. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ కుట్ర అని కూటమి పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఓట్లు చీల్చేందుకు వైసిపియే ఈ కుట్రకు తెరతీసిందని మండిపడుతున్నారు.కూటమి అభ్యర్థులకు విజయావకాశాలు ఉన్నచోట ప్రత్యేక వ్యూహంతో పెద్ద ఎత్తున ఇండిపెండెంట్ లను బరిలో దించారని.. వారికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించేలా ఎన్నికల అధికారులపై ఒత్తిడి పెంచారు అన్నది కూటమి నేతల ఆరోపణ. దాదాపు 50 కి పైగా శాసనసభ, లోక్సభ స్థానాల్లో ఇండిపెండెంట్ లకు, చిన్నాచితక పార్టీలకు చెందిన అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించడం విశేషం.
టిడిపి అధినేత చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పంలో నీలమ్మ అనే ఇండిపెండెంట్ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. ఆమె అధికార పార్టీకి చెందిన సర్పంచ్ భార్య. ఆయన మాత్రం వైసిపి అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. అచ్చెనాయుడు పోటీ చేస్తున్న టెక్కలి, గంటా శ్రీనివాసరావు పోటీ చేస్తున్న భీమిలిలో సైతం స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. వీరికే కాదు తెలుగుదేశం పార్టీకి విజయ అవకాశాలు ఉన్న చాలా నియోజకవర్గాల్లో ఇదే మాదిరిగా వ్యవహారం నడిచింది. ఆమదాలవలస, విశాఖ తూర్పు, విజయవాడ సెంట్రల్,విజయవాడ తూర్పు, మైలవరం, జగ్గయ్యపేట, గన్నవరం, మచిలీపట్నం, పాలకొల్లు,తణుకు, మండపేట, రాజమండ్రి అర్బన్, అద్దంకి, పర్చూరు,చీరాల నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ లకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు.
కూటమిలోని రెబల్ అభ్యర్థులకు సైతం గాజు గ్లాస్ గుర్తును కేటాయించడం విశేషం. విజయనగరం అసెంబ్లీ నుంచి టిడిపి రెబల్ గా బరిలో దిగిన మాజీ ఎమ్మెల్యే మీసాల గీతకు, జగ్గంపేట నుంచి జనసేన రెబల్ గా బరిలో దిగిన సూర్యచంద్రకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. పెదకూరపాడులో అయితే వైసిపి అభ్యర్థి కుమారుడు ఇండిపెండెంట్ గా పోటీ చేయగా ఆయనకు సైతం గాజు గ్లాస్ గుర్తుకే కేటాయించారు.మాచర్ల, చంద్రగిరి, రాప్తాడు, తాడిపత్రి, గుంతకల్లు నియోజకవర్గాల్లో కొందరికి గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. లోక్సభ స్థానాలకు సంబంధించి ఒంగోలు, అనకాపల్లి, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, బాపట్ల నియోజకవర్గాల్లో సైతం ఇండిపెండెంట్ లకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించడం విశేషం. అయితే దీని వెనుక వైసీపీ వ్యూహం ఉన్నట్లు కూటమి అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అందుకే జనసేన పోటీ చేసే స్థానాలను తప్పించి మిగతా నియోజకవర్గాల్లో.. గాజు గ్లాసు గుర్తు దక్కిన చోట ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.