Chandrababu: ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి కీలకం. తప్పకుండా గెలవాల్సిందే. లేకుంటే ఇబ్బందికర పరిణామాలు తప్పవు. తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పార్టీ శ్రేణులు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అంతర్గతంగా ఓ టీం పని చేస్తుంది. పొత్తులు, రాష్ట్రవ్యాప్తంగా అంతర్గత సమస్యలు, పార్టీలకు మధ్య సమన్వయం వంటివి ఈ టీం చూస్తుంది. అయితే భాగస్వామ్య పార్టీ అయిన బిజెపి వ్యవహరిస్తున్న తీరుపై ఈ బృందం అనుమానంతో ఉంది. తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. అనవసరంగా బిజెపితో పొత్తు పెట్టుకున్నామని మదనపడుతోంది.
వాస్తవానికి బిజెపితో పొత్తు టిడిపి శ్రేణులకు ఇష్టం లేదు.మెజారిటీ క్యాడర్ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి కూడా.కానీ ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ నుంచి సాయం అందుతుందని భావించి చంద్రబాబు అతి కష్టం మీద బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. అయితే ఇంతవరకు అటువంటి సాయం అందడం లేదు. ఒకరిద్దరు అధికారులను బదిలీ చేశారు. రాష్ట్ర డిజిపి తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బదిలీ చేయాలని టిడిపి డిమాండ్ చేస్తుంది. అయితే అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్ప స్పష్టమైన ఆదేశాలంటూ జారీ కావడం లేదు. అటువంటప్పుడు పొత్తు పెట్టుకుని ఏం లాభం అన్న ప్రశ్న ఇప్పుడు ఉత్తమవుతోంది.మరోవైపు ఎలక్షన్ కమిషన్ నుంచి సానుకూల నిర్ణయాలు రావడం లేదు. ముఖ్యంగా జనసేన గుర్తు గాజు గ్లాసు విషయంలో సానుకూలత రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది. జనసేన తో పాటు ఇండిపెండెంట్ లకు సైతం గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. ఇది గందరగోళానికి కారణం అవుతోంది. బిజెపి ఎలక్షన్ కమిషన్ పై ఒత్తిడి చేయడంలో విఫలమైందన్న టాక్ వినిపిస్తోంది.
నెల రోజుల కిందట చిలకలూరిపేట ప్రచార సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. అటు తరువాత బిజెపి అగ్ర నేతలు ఏపీ వైపు చూడలేదు. మే మొదటి వారంలో భారీ బహిరంగ సభలకు హాజరవుతారని భావించారు. కానీ అవి ఆరు, ఏడు తేదీలకు దాటాయి. మిగతా రాష్ట్రాల మాదిరిగా బిజెపి అగ్రనేతలు, బిజెపి పాలిత రాష్ట్రాల సీఎంలు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారని టిడిపి భావించింది. కానీ అటువంటిదేమీ జరగలేదు. అయితే ఈ పరిణామాలన్నీ వైసీపీకి లాభం చేకూర్చేలా ఉన్నాయన్నది టిడిపి భావన. అందుకే బిజెపితో పొత్తు విషయంలో టిడిపిలోనే ప్రత్యేక బృందం మదనపడుతున్నట్లు తెలుస్తోంది.