AP Congress: సాధారణంగా ఎన్నికలు అన్నాక.. అవకాశాలు దక్కని వారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు. తన అవకాశాన్ని తన్నుకు పోయిన వారిని, తనకు గౌరవం ఇవ్వని అధిష్టానాన్ని దెబ్బతీయడానికి ఎక్కువ మంది నేతలు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు. గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందిన వారు కూడా ఉన్నారు. క్యాడర్ తో పాటు ప్రజల్లో పలుకుబడి ఉన్న నాయకులు చాలామంది ఇండిపెండెంట్ గా పోటీ చేసి సత్తా చాటారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రత్యర్థిని దెబ్బతీయడానికి మాత్రమే ఇండిపెండెంట్ గా పోటీ అక్కరకు వస్తోంది. విజయం దక్కాలంటే ఏదో ఒక పార్టీ అవసరం. ఆ పార్టీ గుర్తుపై ముందుకెళ్లడమే శ్రేయస్కరం. అయితే ఏపీలో ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి ముందుకు వస్తున్న అభ్యర్థులకు.. చాలా పార్టీలు ఆప్షన్ గా ఉన్నాయి. అన్నింటికంటే ముందుగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ఉంది. నియోజకవర్గాల్లో కాస్త పలుకుబడి, ఆపై పార్టీల్లో పని చేసే వారికి ప్రాధాన్యత దక్కుతోంది.
షర్మిల కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న తర్వాత ఆ పార్టీ ఉనికి పెరిగింది. విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి సైతం కార్యకర్తల తాకిడి గణనీయంగా పెరుగుతూ వస్తోంది. ఔత్సాహికులైన చాలామంది యువకులు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ 120 వరకు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే 2014, 2019 ఎన్నికల తో పోల్చుకుంటే.. ఈ ఎన్నికల్లో మాత్రం యువకులు, పూర్వాశ్రమంలో గట్టిగా పని చేసే నాయకులు అభ్యర్థులుగా దొరకడం కాంగ్రెస్ పార్టీ ఆశలను చిగురిస్తోంది.
వైసీపీలో టిక్కెట్లు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓ నలుగురైదుగురు షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు. అటు తెలుగుదేశంలో టికెట్లు ఆశించిన నాయకులు సైతం.. పార్టీ మొండి చేయి చూపేసరికి కాంగ్రెస్ పార్టీ ఆశాదీపంలా కనిపించింది. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో టిడిపి టికెట్ను పాసర్ల ప్రసాద్ అనే సీనియర్ నాయకుడు ఆశించారు. టికెట్ దక్కక పోయేసరికి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని భావించారు. కానీ ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. టికెట్ కూడా కేటాయించింది.
తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించారు. 2014లో ఆయన వైసీపీ టికెట్ దక్కకపోయేసరికి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందారు. తరువాత టిడిపిలో చేరారు. గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల్లో సైతం వైసీపీ టికెట్ ఆశించారు. జగన్ మాత్రం టిడిపి నుంచి వచ్చిన కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు ఖరారు చేశారు. దీంతో ఆమంచి కృష్ణమోహన్ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని భావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించడంతో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. చీరాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె తొలిసారిగా ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో రెండోసారి పోటీ చేసి ఎర్రం నాయుడు పై గెలుపొందారు. జైంట్ కిల్లర్ గా నిలిచారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా కృపారాణి పార్టీని వీడలేదు. కానీ గత ఎన్నికలకు ముందు ఆమె వైసీపీలో చేరారు. మొన్నటి వరకు ఆ పార్టీలో పని చేసిన పెద్దగా గుర్తింపు లేదు. అందుకే వైసీపీ నుంచి బయటకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. మొత్తానికైతే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనుకున్న వారికి కాంగ్రెస్ పార్టీ ఒక ఆశాదీపం లా కనిపిస్తోంది.