CM Chandrababu: చట్టసభల్లో ప్రజా సమస్యలు ప్రస్తావించాలి. వాటిని ప్రతిబింబించేలా చేయాలి. ప్రజాస్వామ్యానికి గట్టి పునాది చట్టసభలే. దురదృష్టవశాత్తు అటువంటి చట్టసభలకు ఏపీలో సభ్యులు గైర్హాజరవుతున్నారు. రకరకాల రాజకీయ కారణాలు చెప్పి శాసనసభను బహిష్కరిస్తున్నారు. సభలో నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన సభ్యులు సభ బయట ఉండి విమర్శలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇదే వైఖరితో ఉన్నారు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి ఆయన సభకు గైరహాజరవుతూ వచ్చారు. తనతో పాటు ఎమ్మెల్యేలను నియంత్రిస్తున్నారు. అయితే పక్కనే ఉన్న శాసనమండలికి మాత్రం ఎమ్మెల్సీ సభ్యులు వస్తున్నారు. పార్లమెంటులో లోక్సభకు వెళ్తున్నారు. రాజ్యసభకు వెళ్తున్నారు. ఎటు వచ్చి శాసనసభకు మాత్రమే హాజరు కావడం లేదు. అయితే ఐదేళ్ల వైసిపి హయాంలో చట్టసభలు ఎలా నడిచాయి అనేది పక్కన పెడితే.. అప్పట్లో పరనింద,ఆత్మ స్తుతి ఎక్కువగా ఉండేది. ఆపై సభలో ఎక్కువగా జగన్ నామస్మరణ వినిపించేది.
* అప్పట్లో అనుమతులు తీసుకోవాల్సిందే..
మరోవైపు వైసీపీ హయాంలో 22 మంది ఎంపీలు ఉండేవారు. సంఖ్యా బలంగా ఇది చాలా ఎక్కువ. ప్రస్తుతం కూటమిపరంగా 21 మంది మాత్రమే ఎంపీలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి 16 మంది మాత్రమే ఉన్నారు. అయితే ఎవరికీ రానంత అరుదైన చాన్స్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కానీ ఆ పార్టీ సద్వినియోగం చేసుకున్న దాఖలాలు లేవు. ఏపీ గురించి పెద్దగా ప్రస్తావన ఉండేది కూడా కాదు. అప్పుడు కూడా ఒకరిద్దరు ఎంపీలకు మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చేవారు. వారి అనుమతి లేనిదే ఏ మంత్రిని కలవనిచ్చేవారు కాదు.. ఎవరినైనా కలవాలి అంటే తప్పకుండా ఒకరిద్దరి అనుమతులు తీసుకోవాల్సిందే. మీడియాతో మాట్లాడడం కూడా కుదిరే పని కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చంద్రబాబు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు.
* ప్రతి ఎంపీకి బాధ్యతలు..
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి 16 మంది ఎంపీల బలం ఉంది. అందులో ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంపీగా ఎన్నికైన కింజరాపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ మరో కేంద్రమంత్రిగా ఉన్నారు. లోక్సభలో పార్లమెంటరీ పక్ష నేతగా లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. ఇంకా టిడిపికి 13 మంది ఎంపీలు కొనసాగుతున్నారు. అయితే వీరి విషయంలో చంద్రబాబుతో పాటు లోకేష్ చాలా స్వేచ్ఛ ఇచ్చారు. ఏపీకి సంబంధించి కేంద్రంలో నిర్వర్తించాల్సిన విధులను అప్పగించారు. వీరికి శాఖలను కూడా కేటాయించారు. ఏపీ నుంచి నిర్వర్తించాల్సిన విధుల విషయంలో శాఖల వారీగా పనులు కట్టబెట్టారు. ఇటీవల చంద్రబాబు దిశ నిర్దేశం చేయగా.. ఇటీవల లోకేష్ సైతం ఏపీ ప్రయోజనాలు విషయంలో ఎంపీలకు కీలక సూచనలు చేశారు. గతం కంటే ఏపీ ఎంపీలు అర్థమంతమైన చర్చల్లో పాల్గొంటున్నారు.