AP New Pensions: కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్లు ఇవ్వాలని భావిస్తోంది. 60 సంవత్సరాలు దాటిన వృద్ధులతో పాటు 50 సంవత్సరాలు దాటిన బీసీ, ఎస్సీ,ఎస్టీ వారికి సైతం పింఛన్లు అందించేందుకు కార్యాచరణ ప్రారంభించింది. జూన్ 12 నాటికి కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుంది. అందుకే ఎన్నికల్లో హామీ ఇచ్చిన మాదిరిగా.. కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అదే జరిగితే దేశంలోనే ఏపీ సంక్షేమ పథకాల పరంగా రికార్డు క్రియేట్ చేసినట్టే.
* అదనంగా రూ.700 కోట్ల భారం..
ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా పేరుతో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళ, కిడ్నీ సంబంధిత రోగులు, డప్పు కళాకారులు, చర్మకారులు వంటి విభాగాల్లో పింఛన్లు అందుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 62 లక్షలకు పైగా పింఛన్లు అందిస్తున్నారు. ఇందుకు గాను నెలవారీగా రూ. 2,700 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. దాదాపు ఏడాదికి 41 వేల కోట్ల రూపాయలు భారం పడుతోంది ప్రభుత్వానికి. అయితే ఇప్పుడు అదనంగా 15 లక్షల పింఛన్లు అందించాలని నిర్ణయించడం విశేషం. ఇప్పటినుంచి అదనంగా 700 కోట్ల రూపాయల వరకు భారం పడనుంది రాష్ట్ర ప్రభుత్వంపై. తాము అధికారంలోకి వస్తే కొత్త పింఛన్లు అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత స్పోజ్ కోటా కింద పింఛన్లు అందజేశారు. వివిధ రుగ్మతలతో బాధపడే వారికి వాటిని అందజేశారు. అయితే ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పింఛన్ పథకం ఇంకా అమలు కాలేదు. దానికోసమే ఎక్కువ మంది ఎదురుచూస్తూ వచ్చారు.
* బకాయిలతో సహా చెల్లింపులు..
అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త పింఛన్లు అందిస్తామన్న హామీ ఎట్టకేలకు తీరనుంది. కానీ తాము అధికారంలోకి వస్తే.. మూడువేల రూపాయలు ఉన్న సామాజిక పింఛన్ మొత్తాన్ని నాలుగు వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలా ఇచ్చిన హామీని 2024 ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని చెప్పారు చంద్రబాబు. చెప్పిన మాదిరిగే అధికారంలోకి వచ్చిన తరువాత జూన్ నెలలో మూడు నెలల బకాయిలతో సహా చెల్లింపులు చేశారు. అయితే నవరత్నాల్లో భాగంగా పింఛన్లు అందిస్తామని ఇచ్చిన హామీని రెండేళ్ల తర్వాత నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు ఆర్థికపరంగా అధ్యయనం చేశారు. అది ఒక కొలిక్కి రావడంతో.. ఇప్పుడు పింఛన్లు అందించేందుకు సన్నాహాలు ప్రారంభించారన్నమాట. అయితే ప్రభుత్వ ప్రణాళికతో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
