Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu: చీపురుపల్లి పై చంద్రబాబు ఫోకస్.. అసలు కారణం ఇదీ

Chandrababu: చీపురుపల్లి పై చంద్రబాబు ఫోకస్.. అసలు కారణం ఇదీ

చీపురుపల్లి నియోజకవర్గం నుంచి తొలుత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు బలంగా వినిపించింది.ఆయన ప్రతి ఎన్నికలోను నియోజకవర్గాలను మార్చుతుంటారు.

Chandrababu: రాష్ట్రంలో కొన్ని కీలక నియోజకవర్గాల విషయంలో టిడిపి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. బలమైన నేతలు వైసిపికి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో.. అందుకు తగ్గట్టు ధీటుగా అభ్యర్థులను నిలపాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ప్రధానంగా బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి పై ఫోకస్ పెట్టారు. ఇక్కడ మాజీమంత్రి కిమిడి మృణాళిని కుమారుడు నాగార్జున టిడిపి ఇన్చార్జిగా ఉన్నారు. అయితే సర్వేల్లో బొత్స ముందంజలో ఉండడంతో.. టిడిపి నుంచి సీనియర్ ను బరిలోదించాలని చంద్రబాబు భావించారు. చాలామంది పేర్లను పరిశీలించారు కానీ.. ప్రత్యర్థి బొత్స కావడంతో టిడిపి నేతలు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో మరింత వడబోత దిశగా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు.

చీపురుపల్లి నియోజకవర్గం నుంచి తొలుత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు బలంగా వినిపించింది.ఆయన ప్రతి ఎన్నికలోను నియోజకవర్గాలను మార్చుతుంటారు.గత నాలుగు ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలుపొందారు.గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి బరిలో దిగి విజయం సాధించారు. ఈసారి కూడా నియోజకవర్గం మారేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో ఆయనను చీపురుపల్లి వెళ్లి పోటీ చేయాలని చంద్రబాబు సూచించారు. కానీ గంటా శ్రీనివాసరావు అందుకు మొగ్గు చూపలేదు. విశాఖ జిల్లా నుంచి ఏదో ఒక నియోజకవర్గంలో పోటీ చేస్తానని చెబుతున్నారు.

అయితే అటు తరువాత మాజీ మంత్రి కళా వెంకట్రావు పేరు ప్రతిపాదనలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న కళా వెంకట్రావు ఎచ్చెర్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత మూడు ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో నుంచి పోటీ చేశారు. 2014లో మాత్రమే గెలుపొందారు. మరోసారి ఎచ్చెర్ల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే చంద్రబాబు కళా వెంకట్రావును చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని సూచించారు. కిమిడి మృణాళినికళా వెంకట్రావుకు స్వయానా మరదలు. బంధుత్వం అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో పోటీ చేయాలని చంద్రబాబు సూచించడానికి అదే ప్రధాన కారణం. అయితే అందుకు కళా వెంకట్రావు ఒప్పుకోలేదని తెలుస్తోంది.తనకు కానీ, తన కుమారుడు కానీ ఎచ్చెర్ల అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. దీంతో చంద్రబాబు డిఫెన్స్ లో పడిపోయారు.

తాజాగా మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరు ప్రతిపాదనలోకి తీసుకున్నట్లు సమాచారం.ఆమె 2014 ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో కూడా అసెంబ్లీ సీటును ఆశించారు. కానీ హై కమాండ్ అశోక్ గజపతిరాజు కుమార్తెకు ఖరారు చేసింది. దీంతో మీసాల గీత అసంతృప్తికి గురయ్యారు. అందుకే ఆమె పేరును సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. బొత్స సత్యనారాయణ తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతకాగా.. అదే సామాజిక వర్గానికి చెందిన మహిళ నాయకురాలను నిలబెడితే.. వర్కౌట్ అవుతుందన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. మొత్తానికైతే బొత్సను ఎలాగైనా పడగొట్టాలన్న కృత నిశ్చయంతో చంద్రబాబు ఉన్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper