Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశమయ్యాయి. అధికార కాంగ్రెస్లో అంతర్గత ముసలం రోజు రోజుకూ ముదురుతోంది. ఒకవైపు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు. మొన్నటి వరకు మంత్రి పదవి కోసం ప్రయత్నించాడు. విఫలం కావడంతో తిరుగుబాట పట్టారు. తాజాగా సీఎం రేవంత్రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా పరకాల జరిగిన బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డినే వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయించాలని, ఆయనను ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. ఇవి తన మంత్రివర్గ సహచరురాలు కొండా సురేఖకు షాక్ ఇచ్చాయి. పరకాల సీటు తన కూతురుకు ఇప్పించాలని మంత్రి కంటున్న కలలు కల్లలయ్యాయి.
పరకాల టికెట్పై సీఎం స్పష్టత..
ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా సురేఖకు, ఇతర ఎమ్మెల్యేలకు మధ్య సఖ్యత కొరవడింది. కొండాపై ఇటీవలే ఉమ్మడి జిల్లా నేతలు సీఎంకు, పీసీసీ చీఫ్కు ఫిర్యాదు చేశారు. కొండా మురళి అరాచకాలనూ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో పరకాల సభలో రేవంత్రెడ్డి స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కృషిని ప్రశంసించారు. ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన పనులను గుర్తు చేస్తూ, వచ్చే ఎన్నికల్లో కూడా ఆయననే గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఇది సాధారణ ప్రోత్సాహం కాకుండా, స్పష్టమైన రాజకీయ సంకేతం. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా, సీఎం స్థాయిలో ఇలా పేరు తీసుకుని మాట్లాడటం అరుదు. దీంతో పరకాల సీటుపై రేవూరి ప్రకాశ్రెడ్డికి అధికార పార్టీలో బలమైన మద్దతు ఉన్నట్లు స్పష్టమైంది.
కొండా ఆశలు ఆవిరి..
మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి గత కొన్ని నెలలుగా తమ కుమార్తె సుష్మితను పరకాల నుంచి బరిలోకి దించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబం పరకాలను తమ రాజకీయ కంచుకోటగా భావిస్తూ, సుష్మితను తదుపరి తరం నాయకురాలిగా నిలబెట్టాలని చూస్తున్నారు. గతంలో కూడా సురేఖ పరకాల నుంచి పోటీ చేసిన నేపథ్యం ఉంది. కానీ సీఎం నేరుగా ప్రస్తుత ఎమ్మెల్యే పేరు చెప్పి మద్దతు తెలపడంతో కొండా కుటుంబం ఆశలు ఆవిరయ్యాయి. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే, సీఎం ఉమ్మడి వరంగల్ పర్యటనలో కొండా సురేఖ–మురళి దంపతులు హాజరు కాలేదు. మేడారం నుంచి పరకాల వరకు జరిగిన కార్యక్రమాల్లో వారు కనిపించకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
రాజకీయ పరిణామాల్లో మార్పు తప్పదా?
ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమతుల్యతను సూచిస్తోంది. సీఎం స్థానిక ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇస్తూ, కుటుంబ రాజకీయాలకు దూరంగా ఉండాలనే సందేశం ఇచ్చినట్లు కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పరకాలలో రేవూరి ప్రకాశ్రెడ్డి బలమైన స్థానిక నాయకుడిగా ఉన్నారు. ఆయనను కొనసాగించడం ద్వారా పార్టీలో స్థిరత్వం కాపాడుకోవాలని సీఎం భావించి ఉండవచ్చు. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. టిక్కెట్ పంపిణీ అధికారికంగా జరగాల్సి ఉంది. కొండా కుటుంబం ఇప్పుడు ఎలా స్పందిస్తుందో, సుష్మిత ఏమి చేస్తారో చూడాలి. పార్టీలోని ఇతర నాయకులు కూడా ఈ సంకేతాన్ని గమనిస్తూ ఉంటారు.
మొత్తంగా చూస్తే పరకాల సభ ద్వారా కొండా కుటుంబం పెద్ద అండ కోల్పోయినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే సురేఖ పనితీరుపై సీఎం అసంతృప్తిగా ఉన్నారు. ఆమెకే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఆమెతోపాటు ఆమె కుటుంబానికి షాక్ ఇచ్చారు. సీఎం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.