Homeఆంధ్రప్రదేశ్‌Nagababu: నాగబాబు ఎంపీ సీటు త్యాగం వెనుక పెద్ద కథ

Nagababu: నాగబాబు ఎంపీ సీటు త్యాగం వెనుక పెద్ద కథ

Nagababu: ఈ ఎన్నికల్లో నాగబాబు పోటీ చేస్తారా లేదా? చేస్తే ఎక్కడి నుంచి చేస్తారు? అనకాపల్లి నుంచి తప్పుకున్నది ఎందుకు? దీని వెనుక వ్యూహం ఏమైనా ఉందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా నాగబాబు కనిపించకపోయేసరికి రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. కానీ ఆయన జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ప్రకటన జారీ చేశారు. తనకు పదవులు అవసరం లేదని.. జన సైనికుడు అన్న పదమే పదవితో సమానమని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. నామినేటెడ్ పదవులు చాలా వరకు ఉన్నాయని అసంతృప్త జన సేన నాయకులను బుజ్జగించే ప్రయత్నం చేయడం విశేషం.

అనకాపల్లి పార్లమెంట్ స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించినట్లు ప్రచారం జరిగింది. అక్కడ నుంచి నాగబాబు పోటీ చేస్తారని కూడా టాక్ నడిచింది. అందుకు తగ్గట్టుగానే అనకాపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలో నాగబాబు యాక్టివిటీస్ పెంచారు. ఆ పార్లమెంట్ స్థానం పరిధిలోని ఎలమంచిలిలో ఒక ఇంటిని అద్దెకు కూడా తీసుకున్నారు. అయితే ఇంతలో రాజకీయ సమీకరణలు మారాయి. తొలుత ఆ స్థానం నుంచి ఎంపీగా పవన్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ బిజెపి కోసం పొత్తులో భాగంగా ఆ సీటును నాగబాబు త్యాగం చేసినట్లు తెలుస్తోంది. అయితే పైకి త్యాగం అన్న పేరు పెట్టి.. లోపల మాత్రం వేరే వ్యూహంతో ముందుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి అల్లు అరవింద్ అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. ఇక్కడ స్థానిక నినాదం అన్నది బలంగా పనిచేస్తుంది. అందుకే నాగబాబు సడన్గా ఇక్కడి నుంచి టర్న్ అయినట్లు తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వస్తే నాగబాబుకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసినట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై తెలుగుదేశం పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ కోసం నాగబాబు సీటు వదులుకోవడానికి సిద్ధపడటంతో అటు బిజెపిలో సైతం సాఫ్ట్ కార్నర్ ఉన్నట్లు సమాచారం.

వాస్తవానికి ఎన్నికల్లో పోటీ చేయనని నాగబాబు చాలా రోజుల కిందట ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా జనసేనకు మద్దతుగా ప్రచారం చేస్తానని.. సమన్వయ బాధ్యతలు తీసుకుంటానని చెప్పుకొచ్చారు. అయితే గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేసిన నాగబాబు మూడున్నర లక్షల ఓట్లు వరకు దక్కించుకున్నారు. ఈసారి పొత్తులో భాగంగా అక్కడ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేయనని నాగబాబు ప్రకటించారు. కేవలం ప్రచారానికే పరిమితం అవుతానని తేల్చి చెప్పారు. ఇంతలో అనకాపల్లి ఎంపీ సీట్ పై తెరపైకి వచ్చారు. కానీ అక్కడ నుంచి అనూహ్యంగా వెళ్లిపోయారు. అయితే దీని వెనుక రాజ్యసభ ఆఫర్ ఉన్నట్లు కొత్తగా ప్రచారం జరుగుతోంది. అటు బిజెపి నుంచి లైన్ క్లియర్ చేసుకునేందుకే ఈ త్యాగం డ్రామా ఆడారని వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ముందుగా పవన్ తెలుగుదేశం పార్టీని ఒప్పించారని.. మధ్యలో అనకాపల్లి ఎంపీ సీటు త్యాగం చేసినట్టు డ్రామా ఆడారని.. ఇదంతా సోదరుడు నాగబాబు కోసమేనని వైసిపి సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది. అటు నాగబాబు తాజా ప్రకటన కూడా అదే విధంగా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్నో రకాల నామినేటెడ్ పదవులు జనసైనికులకు దక్కే అవకాశం ఉందని నాగబాబు చెప్పడం విశేషం. మొత్తానికైతే చిరంజీవి తర్వాత ఆ కుటుంబంలో నాగబాబు రాజ్యసభ సభ్యుడు అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular