Homeఆంధ్రప్రదేశ్‌AP DSC Notification 2024: ఏపీలో నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్

AP DSC Notification 2024: ఏపీలో నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్

AP DSC Notification 2024: ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే ఏపీ క్యాబినెట్ 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. పది రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ వివరాలను వెల్లడించారు.

ఈ నెల 12 నుంచి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా ఈనెల 27 నుంచి మార్చి 9 వరకు టెట్ పరీక్ష కొనసాగునుంది. టెట్ కు సంబంధించి మార్చి 5 ను హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 14న ఫలితాలు వెల్లడించనున్నారు. మార్చి 15 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. 31న డీఎస్సీ ప్రాథమిక కీ విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 2న ఫైనల్ కీ, 7న ఫలితాలను ప్రకటించనున్నారు. మొత్తం 6,100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 2,280 సెకండరీ గ్రేడ్ టీచర్లు, 2,299 స్కూల్ అసిస్టెంట్లు, 1,264 టీజీటీ, 215 పీజీటీలు, 242 ప్రిన్సిపాళ్ల నియామకం చేపట్టనున్నారు.

అయితే పుష్కరకాలం కిందట విధానాన్ని ఇప్పుడు తెరపైకి తేవడం విశేషం. అప్రెంటిస్ విధానాన్ని కొత్తగా ప్రవేశపెట్టనున్నారు. దీని ప్రకారం డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులు రెండేళ్ల పాటు గౌరవ వేతనానికి పనిచేయాల్సి ఉంటుంది. అప్రెంటిస్ షిప్ లో ఉన్నప్పుడు ఎవరైనా ఏపీ ఉద్యోగుల నిబంధనలు పాటించకపోతే వారి అప్రెంటిస్ షిప్ ను పొడిగిస్తారు. డీఎస్సీ, టెట్ ఎగ్జామ్స్ ను కంప్యూటర్ ఆధారిత పరీక్షలు గా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి ఏపీ విద్యాశాఖ టిసిఎస్ తో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు సమాచారం.

వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం మెగా డీఎస్సీ ప్రకటిస్తామని, ఏటా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని, ఉద్యోగ భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. నాడు చంద్రబాబు 7,100 ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తే.. ఇవి ఒక పోస్టులేనా? అని ఎద్దేవా చేశారు. కానీ అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు దాటుతున్నా డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించలేదు. దీనిపై విమర్శలు వ్యక్తం కావడం, నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసన తెలపడం, ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పుడు డీఎస్సీ ప్రకటించారు. అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న నేపథ్యంలో.. డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular