YS Rajasekhar Reddy: వరుస ఓటములు.. చంద్రబాబు దూకుడు మీద ఉన్నాడు. క్యాడర్లో నిరాశ.. ఇలాంటి సమయంలో రాజశేఖర్ రెడ్డి కాళ్లకు బూట్లు తొడుక్కున్నారు. మండే ఎండల్లో తనకు తలపాగా ధరించారు. పాదయాత్ర మొదలుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ.. కోస్తా ఆంధ్ర.. రాయలసీమ ప్రాంతాలను చుట్టి వచ్చారు.
నాడు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న పత్రికల సైతం రాజశేఖర్ రెడ్డి గురించి రాయక తప్పలేదు. నాడు అనేక సమస్యలను గుర్తించి.. అధికారంలోకి వచిన తర్వాత పరిష్కరిస్తామని రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి అంచనా వేసినట్టుగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టులు.. నాటి తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుని ఎక్కువ సీట్లు సాధించి.. కాంగ్రెస్ పార్టీ సత్తా చూపించింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకరకంగా సంక్షేమ పథకాల అమలులో సరికొత్త ఒరవడి సృష్టించారు. ఆరోగ్యశ్రీ.. ఫీజు రీయింబర్స్మెంట్.. జలయజ్ఞం వంటి పథకాల ద్వారా ఏపీ రాష్ట్రంలో రాజకీయాలలో సరికొత్త సంచలనం సృష్టించారు.
వైయస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించారు. కాంగ్రెస్ పార్టీలో వర్గ రాజకీయాలు.. వర్ణ రాజకీయాలు కొత్త కాదు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇవి బ్రహ్మాండంగా జరిగాయి. అధిష్టానానికి కొంతమంది రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేసేవారు. ఆయన పరిపాలన కాలంలో అక్రమాలు జరుగుతున్నాయని మీడియాకు ఎక్కి బయటపెట్టేవారు. అధిష్టానం కూడా మొదట్లో రాజశేఖర్ రెడ్డి విషయంలో కఠిన వైఖరి అవలంబించేది. ఆయనకు పనిచేసే స్వేచ్ఛ కూడా ఇవ్వలేదు. ఇలా అనేక అవాంతరాలను దాటి రాశేఖర్ రెడ్డి చివరికి అధిష్టానాన్ని శాసించే స్థాయికి వచ్చారు. మంత్రివర్గం.. అభివృద్ధి కార్యక్రమాలు.. సంక్షేమ పథకాల అమలులో తనకు స్వేచ్ఛ వచ్చేలాగా చూసుకున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంతోమంది నాయకులు ముఖ్య మంత్రులుగా పని చేశారు. కానీ వారు ఎవరు కూడా రాజశేఖర్ రెడ్డి లాగా పరిపాలించలేకపోయారు. ప్రభుత్వంలో.. పార్టీలో పట్టు దక్కించుకోలేకపోయారు. అందువల్లే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి స్థానం చిరస్థాయిగా ఉంది. తెలంగాణలో ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి ఉన్నప్పటికీ.. రాజశేఖర్ రెడ్డి లాగా ఆయన పరిపాలన మీద.. పార్టీ మీద పట్టు సొంతం చేసుకోలేకపోతున్నారు. ఒక రకంగా దీనికి అధిష్టానం కూడా కారణం. రాజశేఖర్ రెడ్డి విషయంలో కూడా అధిష్టానం మొదట్లో ఇదే ధోరణి అవలంబించింది. కానీ ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి తనదైన మార్క్.. మార్పు చూపించడంతో అధిష్టానం కూడా తలవంచక తప్పలేదు. గులాం నబీ ఆజాద్.. వీరప్ప మొయిలి.. దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్లు అధిష్టానం దూతలుగా ఉండేవాళ్లు. వారిని కూడా రాజశేఖర్ రెడ్డి మేనేజ్ చేయగలిగారు. అంతేకాదు, తనకు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదులు చేసిన వారికి గట్టి సమాధానమే చెప్పగలిగారు.