Pakistan Occupied Kashmir: కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కాశ్మీర్లో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి కార్యకలాపాలు అక్కడ వేగంగా సాగుతున్నాయి. అత్యంత కఠినమైన ప్రాంతంలో కూడా విద్యుత్ సౌకర్యం.. రహదారి సౌకర్యం అందుబాటులోకి వస్తున్నాయి. అంతేకాదు ప్రజాస్వామ్య విధానంలో అక్కడ ఎన్నికలు కూడా జరిగాయి. ఇవన్నీ చూస్తున్న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలకు ఎప్పుడెప్పుడు భారతదేశంలో విలీనం కావాలని చూస్తున్నారు. అందువల్లే కొంతకాలంగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు సాగిస్తున్నారు.
ఇటీవల పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. పాకిస్తాన్ ఆర్మీ రంగంలోకి దిగి హింసాత్మక ఘటనలకు పాల్పడినప్పటికీ అక్కడి ప్రజలు ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. పైగా ఆర్మీపై ఇటీవల దాడులు కూడా చేశారు. దీంతో అక్కడ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలోని అక్కడి ప్రజలు తమ నిరసన స్వరూపాన్ని మరో విధంగా మార్చారు. దీంతో పాకిస్తాన్ దేశానికి షాక్ తగిలినంత పని అయింది.
ఇప్పటికే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు నిరసనలను తీవ్ర స్థాయిలో వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తాము పాకిస్తాన్లో భాగం కాదంటూ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.. మీరు ఇచ్చే రేషన్ మాకు అవసరం లేదు.. మమ్మల్ని మీరు వాడుకుంటున్నారు.. నిత్యావసరాలు రాకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మాకు నరకం అంటే ఏంటో చూపిస్తున్నారు. కానీ మాకు వేరే దారి ఉంది. మేము కచ్చితంగా మా ప్రాణాలు కాపాడుకోవడానికి ఇతర మార్గాలను అన్వేషిస్తూనే ఉంటాం. అంటూ పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతంలో నిరసనలు చేపడుతున్న ప్రజలు నినదిస్తున్నారు. రావల్కోట్ ప్రాంతంలో జరిగిన నిరసన కార్యక్రమంలో భారీ ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
గడిచిన నెల రోజులుగా రావల్కోట్ ప్రాంతంలో ప్రజలు తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతానికి స్వేచ్ఛ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు జరపాలని.. ప్రజలకు స్వేచ్ఛ కల్పించాలని.. అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో తాము నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతంగా నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు.
