Homeఅంతర్జాతీయంPakistan Mediation failure Middle East War: పాకిస్తాన్‌ దౌత్య నాటకం.. ఎవరూ నమ్మని మధ్యవర్తిత్వం!

Pakistan Mediation failure Middle East War: పాకిస్తాన్‌ దౌత్య నాటకం.. ఎవరూ నమ్మని మధ్యవర్తిత్వం!

Pakistan Mediation failure Middle East War: ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్లుగా ఉంది పాకిస్తాన్‌ పరిస్థితి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్‌ ఇప్పుడు హడావుడి చేస్తోంది. పాకిస్తాన్‌ అటు ఇరాన్‌ తరఫున గానీ, ఇటు అమెరికా తరఫున గానీ యుద్ధం చేయడం లేదు. కానీ యుద్ధాన్ని ఆపించడం ద్వారా క్రెడిట్‌ పొందాలని పాకులాడుతోంది. మధ్యవర్తిత్వం వహించాలని చూస్తోంది. యుద్ధం ఆగితే చమురు సంక్షోభం తగ్గుతుంది. హర్మూజ్‌ జలసంధి తెరుచుకుంటుంది. దీంతో చమురు సరఫరా సాఫీగా సాగుతుంది. పాకిస్తాన్‌లో ఆయిల్‌ సంక్షోభం తగ్గుతుంది.

పాక్‌ స్వార్థపూరిత ప్రయత్నం..
పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వం వెనుక స్పష్టమైన స్వార్థం ఉంది. యుద్ధం కొనసాగితే హర్మూజ్‌ జలసంధి మూసుకుపోతుంది. దీంతో చమురు సరఫరాకు అంతరాయం కలుగుతుంది. పాక్‌లో ఇప్పటికే పెట్రోల్‌ ధరలు 42 శాతం, డీజిల్‌ ధరలు 54 శాతం పెరిగాయి. ఆహార ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దిగుమతుల ఖర్చులు పెరిగి, సప్లయ్‌ చైన్‌ దెబ్బతింది. తయారీ రంగం కుప్పకూలింది. విద్యుత్‌ ఛార్జీలు భారీగా పెరిగాయి. ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే యుద్ధం ఆగడం అత్యవసరం. అందుకే ఇస్లామాబాద్‌ మధ్యవర్తిత్వం వహించాలని చూస్తోంది.

మొదటి ప్రయత్నం విఫలం..
మార్చి 29న పాకిస్తాన్‌ ఒక కీలక సమావేశాన్ని నిర్వహించింది. కానీ ఈ సమావేశం పూర్తిగా విఫలమైంది. ఈ సమావేశానికి అమెరికా హాజరు కాలేదు. తమ షరతులు నెరవేరకుండా చర్చలకు కూర్చోమని తేల్చి చెప్పింది. ఇజ్రాయెల్‌ రాలేదు.. ఎందుకంటే అది పాకిస్తాన్‌ను గుర్తించదు. ఇక ఇరాన్‌ హాజరు కాలేదు. యుద్ధాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్న తాము ఎందుకు చర్చలకు రావాలని ప్రశ్నించింది. ఇక ఈ సమావేశానికి సౌదీ అరేబియాను పిలవడంపై యూఏఈ గుర్రుగ్రా ఉంది.

అప్పులు తీర్చాలని యూఏఈ ఒత్తిడి..
చర్చలకు తమను పిలవ కుండా తమ శత్రు దేశమైన సౌదీ అరేబియాను పిలవడం ఇస్లామాబాద్‌కు భారీ దెబ్బగా మారింది. దీంతో ఆ దేశం పాక్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్‌కు అనుకూలంగా పాకిస్తాన్‌ వ్యవహరిస్తోందని ఆరోపించింది. తక్షణమే తమకు ఇవ్వాలన్సిన 2 బిలియన్‌ డాలర్ల అప్పులు చెల్లించాలని పట్టుబడుతోంది. మునుపు సహనంగా వ్యవహరించిన యూఏఈ ఇప్పుడు కఠినంగా మారింది. పాక్‌ ఆర్థిక వ్యవస్థకు ఇది మరో భారం.

పాక్‌ అమెరికా ఏజెంట్‌ అంటున్న ఇరాన్‌..
ఇరాన్‌ కూడా పాకిస్తాన్‌పై నమ్మకం కోల్పోయింది. తాజాగా మరోమారు యుద్ధ విరమణ చర్చలకు పాక్‌ ప్రయత్నించినా, ఇస్లామాబాద్‌పై నమ్మకం లేదని టెహ్రాన్‌ తేల్చి చెప్పింది. పాకిస్తాన్‌ అమెరికా ఏజెంట్‌గా వ్యవహరిస్తోందని భావిస్తోంది. దీంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ పాకిస్తాన్‌ పర్యటన వాయిదా పడింది. ఇరాన్‌ చర్చలతో ఎలాంటి లాభం లేదని స్పష్టం చేసింది. పాక్‌ మధ్యవర్తిత్వం పూర్తిగా విఫలమైంది.

చైనా 220 మిలియన్‌ డాలర్ల డిమాండ్‌
చైనా కూడా పాకిస్తాన్‌పై ఆగ్రహంగా ఉంది. అమెరికాతో దోస్తీ చేస్తోందని భావిస్తోంది. దీంతో చైనా ఎనర్జీ కంపెనీకి చెల్లించాల్సిన 220 మిలియన్‌ డాలర్ల విద్యుత్‌ బిల్లు బకాయిలను తక్షణం చెల్లించాలని డిమాండ్‌ చేస్తోంది. మూడు వైపులా నుంచి ఒత్తిడి రావడంతో ఇస్లామాబాద్‌ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది.

అంతర్గత అల్లకల్లోలం..
యుద్ధ ప్రభావంతో పాకిస్తాన్‌ అంతర్గతంగా అల్లకల్లోలంగా మారింది. ధరలు భారీగా పెరగడంతో ప్రభుత్వం వినియోగాన్ని తగ్గించింది. విద్యుత్, ఇంధన సంక్షోభం కారణంగా పాఠశాలలు, కాలేజీలు మూసివేశారు. ప్రభుత్వ కార్యాలయాలు వారంలో నాలుగు రోజులే పనిచేయాలని ఆదేశించింది. ఆహార, ఇంధన ధరల పెరుగుదలతో ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోంది. ‘మమ్మల్ని చంపేయండి‘ అంటూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయినా సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు. ఐఎంఎఫ్‌ నుంచి 1.2 బిలియన్‌ డాలర్ల సాయానికి ప్రాథమిక ఒప్పందం కుదిరినా అది ఏమూలకు సరిపోయేలాదు.

మొత్తంగా పాకిస్తాన్‌ ప్రస్తుత పరిస్థితి దయనీయంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే, పాకిస్తాన్‌ ఎవరికీ నమ్మకస్థుడు కాదు. అందరికీ అనుమానాస్పదంగా మారింది. మధ్యవర్తిత్వం వహించాలని చూస్తోంది కానీ, ఎవరూ దానిని నమ్మడం లేదు. దీంతో ఇస్లామాబాద్‌ ఎందుకూ పనికిరాని దేశంగా నిలిచిపోయింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular