Iran Rejects Pakistan Mediation Talks: పశ్చిమాసియాలో రగిలిపోతున్న యుద్ధానికి తెరదించేందుకు అమరికా పాకిస్తాన్ను మధ్యవర్తిగా రంగంలోకి దించింది. దీంతో పాకిస్తాన్ చర్యలు ప్రారంభించింది. ఇరాన్, అమెరికా మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఇస్లామాబాద్లో ఇరు దేశాల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలనుకుంది, కానీ, ఇరాన కీలక సమావేశానికి తాము రాబోమని తేల్చి చెప్పింది. అమెరికా విధించిన డిమాండ్లను ఒప్పుకోవడం సాధ్యం కాదని మధ్యవర్తులకు స్పష్టం చేసింది. దీంతో పాక్ సహా పలు గల్ఫ్ దేశాలు చేస్తున్న శాంతి ప్రయత్నాలు మధ్యలోనే ఆగిపోయాయి.
పాక్ ప్రణాళికను తిరస్కరించిన ఇరాన్..
యుద్ధ విరమణ కోసం పాకిస్తాన్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ చొరవ తీసుకున్నారు. ఇస్లామాబాద్లో ఇరుపక్షాల ప్రతినిధులను కలిపి చర్చలు జరిపించాలని భావించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పర్యటన కూడా ఇందులో భాగంగానే ఇస్తామాబాద్కు రావాలనుకున్నారు. కానీ ఇరాన్ మాత్రం ఈ ప్రతిపాదనను తోసిపుచ్చింది. తమ షరతులు నెరవేరకుండా చర్చలకు కూర్చోమని తేల్చి చెప్పింది. ఫలితంగా వాన్స్ పర్యటన రెండోసారి వాయిదా పడింది.
ఇరాన్ ఐదు షరతులు..
ఇరాన్ చర్చలకు సిద్ధమే కానీ, అమెరికా తమ షరతులు ఒప్పుకోవాలని పట్టుబడుతోంది. గల్ఫ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాల మూసివేయాలని డమాండ్ చేస్తోంది. ఇరాన్పై విధించిన ఆర్థిక, వాణిజ్య ఆంక్షలు ఎత్తివేయాలని కోరింది. 2015 జేసీపీవోఏ ఒప్పందాన్ని తిరిగి అమలు చేయాలి కండీషన్ పెట్టింది. ఇరాన్ నేతల హత్యకు అమెరికా అధికారికంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. చివరగా యుద్ధంలో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టాలకు పరిహారం చెల్లించాలని పేర్కొంది. ఈ షరతులు అమెరికాకు ఆమోదయోగ్యం కావని ఇరాన్కు తెలుసు. అయినా, తమ స్థానాన్ని బలపర్చుకోవడానికి ఇలాంటి కఠిన డిమాండ్లు ముందుపెట్టింది.
పాక్కు దౌత్య పరాజయం..
పాకిస్తాన్కు ఇది పెద్ద దెబ్బ. అంతర్జాతీయ వేదికపై తన పేరు సంపాదించుకోవాలని, మధ్యవర్తిగా గుర్తింపు పొందాలని భావించింది. కానీ ఇరాన్ తిరస్కారంతో ఆ ఆశలు నీళ్లు పాలయ్యాయి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఒమన్ లాంటి గల్ఫ్ దేశాలు కూడా శాంతి ప్రయత్నాల్లో పాల్గొన్నాయి. ఇరాన్ కఠిన వైఖరితో వారి ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి.
ఇరాన్ తిరస్కారంతో శాంతి చర్చలకు బ్రేక్ పడింది. పాక్, గల్ఫ్ దేశాల ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇరుపక్షాల మధ్య నమ్మకం లేమి, కఠిన షరతులు యుద్ధాన్ని మరింత తీవ్రం చేస్తున్నాయి.