Bengaluru: ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. లగ్జరీ బస్సులు మినహా మిగతా వాటిల్లో ఆధార్ కార్డు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అయితే కొంతమంది కండక్టర్లు అతిగా ప్రవర్తించడం వల్ల గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవలు తారాస్థాయికి చేరి.. పోలీస్ స్టేషన్ ల వరకు వెళ్తున్నాయి. బస్సులో టికెట్ విషయంలో ఓ మహిళా ప్రయాణికురాలికి, ఆర్టీసీ కండక్టర్ కు ఇలాంటి గొడవే జరిగింది. అది చినికి చినికి గాలి వాన లాగా మారింది. ఫలితంగా అతడు తన ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడు. పోలీసుల చేతిలో అరెస్టుకు గురయ్యాడు..
తెలంగాణలో కంటే ముందు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అక్కడ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రకటించింది. దీంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకుల హామీలు నమ్మి ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ పథకం నిబంధనల ప్రకారం బస్సులో ప్రయాణించే మహిళా ప్రయాణికులు ఆధార్ కార్డు చూపిస్తే చాలు. జీరో టికెట్ కండక్టర్ ఇష్యూ చేస్తారు. అయితే ఈ ఆధార్ కార్డు విషయంలో అక్కడికి రవాణా శాఖ కొన్ని నిబంధనలు విధించింది. ఆధార్ కార్డ్ అప్డేట్ అయి ఉండాలని.. అలా ఉంటేనే జీరో టికెట్ ఇష్యూ చేయాలని సూచించింది. అయితే ఇదే ఓ కర్ణాటక ఆర్టీసీ బస్సులో వివాదానికి కారణమైంది.. బెంగళూరులోని బిలేకల్లి నుంచి శివాజీ నగర్ వెళ్తున్న ఓ బస్సులోకి మహిళా ప్రయాణికురాలు ఎక్కింది. ఆమె ఆధార్ కార్డ్ సరిగ్గా లేకపోవడంతో టికెట్ తీసుకోవాలని కండక్టర్ అడిగాడు. దానికి ఆ మహిళా నిరాకరించింది. అప్పటికి పలుమార్లు అడిగినప్పటికీ ఆమె నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. దీంతో కోపం పట్టలేకపోయిన ఆర్టీసీ కలెక్టర్ ఆమెపైకి చెయ్యెత్తాడు. దీంతో ఆగ్రహంతో ఆ మహిళ అతడి చెంపపై కొట్టింది. సహనం కోల్పోయిన కండక్టర్ ఆమెపై దాడి చేశాడు. దీంతో బస్సులో కలకలం చెలరేగింది. తోటి ప్రయాణికులు ఈ సద్దుమణిగించారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు క్షేత్రస్థాయికి వచ్చి తోటి ప్రయాణికుల నుంచి వివరాలు కనుక్కున్నారు. అనంతరం ఆర్టీసీ కండక్టర్ ను అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ కావడంతో ఆర్టీసీ అతడిని సస్పెండ్ చేసింది.
కాగా, ఈ ఘటన బెంగళూరులో సంచలనంగా మారింది. ఆర్టీసీ కండక్టర్ అతిగా ప్రవర్తించాడని, ఆ మహిళపై తీవ్రంగా దాడి చేశాడని తోటి ప్రయాణికులు చెబుతున్నారు. ఆధార్ కార్డు సరిగ్గా లేకుంటే ఆమెకు అర్థమయ్యేలా చెప్తే బాగుండేదని, అలా కాకుండా దూషించేసరికి ఆమె నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిందని, అలా చెప్పడాన్ని కండక్టర్ సహించలేకపోయాడని.. అసహనంతో చేయి పైకి లేపాడని.. దీంతో ఆ మహిళ అతడిని కొట్టిందని ప్రయాణికులు అంటున్నారు. ఆ తర్వాత కండక్టర్ ఆమెను కొట్టాడని.. ఆమెకు గాయాలు కూడా అయ్యాయని వారంటున్నారు. ఈ ఘటన నేపథ్యంలో కర్ణాటక రవాణా శాఖ తెరపైకి కొత్త నిబంధనలను తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోందని తెలుస్తోంది.
( Free bus scheme na hua ek azab hua) A scramble for a ticket in Bengaluru
RTC conductor brutally assaulted female passenger. pic.twitter.com/1A7sXF7Hoh
— Kabeer کبیر కబీర్ (@_kabeeruddin) March 26, 2024