HomeతెలంగాణBRS Social Media: బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాకు ఏమైంది.. వరుసగా కేసులపాలు!

BRS Social Media: బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాకు ఏమైంది.. వరుసగా కేసులపాలు!

BRS Social Media: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం చేసినా.. సీఎం రేవంత్‌రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. వాటికి బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా దురుద్దేశాలు ఆపాదిస్తోంది. ఫేక్‌ పోస్టులతో విరుచుకుపడుతోంది. క్రమంగా బీఆర్‌ఎస్‌ ఫేక్‌ ప్రచారం పెరగడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా చర్యలకు దిగింది. టిట్‌ ఫర్‌ టాట్‌ అన్నట్లు తప్పుడు ప్రచారాలు చేసేవారిపై కేసులు పెడుతోంది. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా చీఫ్‌ క్రిశాంక్‌ ఇటీవల జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. మరోవైపు బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా కార్యకర్తలపైనా ప్రభుత్వం పెద్దెత్తున కేసులు పెడుతోంది. దీంతో ఇప్పటికే వందలాది కేసులు నమోదయ్యాయి.

అయినా తీరు మార్చుకోని బీఆర్‌ఎస్‌..
ఇప్పటికే వందలాది కేసలు నమోదైనా బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా తీరు మార్చుకోవడం లేదు. ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే లక్ష్యంగా తప్పుడు పోస్టులతో సోషల్‌ మీడియాను ముంచెత్తుతోంది. దీంతో లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ మరో ఫేక్‌ పోస్టును సోషల్‌ మీడియాలో పోస్టు చేసి సీఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్‌ చేసింది. ఇటీవల టీఎస్‌ ఆర్టీసీని యాజమాన్యం టీజీ ఆర్టీసీగా మార్చింది. లోగోను త్వరలో విడుదల చేస్తామని ఎండీ సజ్జనార్‌ ప్రకటించారు. కానీ బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ఏపీఎస్‌ ఆర్టీసీ లోగోను తీసుకుని అందులో ఏపీ తొలగించి టీజీ రాసి సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తోంది. దానికి తెలంగాణ సెంటిమెంట్‌ జోడించి రేవంత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో సాయంత్రానికి కేసుల పాలయ్యారు. ఇలా నిత్యం పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కార్యకర్తలు కేసులపాలవుతున్నారు.

నిజాలు చెప్పినా నమ్మలేని పరిస్థితి..
ఇక బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ఫేక్‌ ప్రచారం ఏ స్థాయికి దిగజారిందంటే.. వారు నిజాలు చెప్పినా నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. ఫేక్‌ పోస్టులకు కేరాఫ్‌గా బీఆర్‌ఎస్‌ అన్నట్లుగా జనాల్లోనూ అభిప్రాయం ఏర్పడుతోంది. దీంతో ఆ పార్టీ ప్రతిష్టే దెబ్బతింటోంది. ఇలా ఫేక్‌లను నమ్ముకుని ఎంతకాలం రాజకీయాలు చేస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నిర్మాణాత్మక పాత్ర ఏదీ..
ప్రజలు బీఆర్‌ఎస్‌ను విపక్షంలో కూర్చోబెట్టారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన ఆ పార్టీ ఇలా ఫేక్‌లను నమ్ముకోవడం విమర్శలకు తావిస్తోంది. ఎన్నికల సమయంలో మాత్రమే సోషల్‌ మీడియా ప్రచారం కాస్త ప్రభావం చూపుతుందని ఎన్నికలు ముగిసిన తర్వాత పెద్దగా ప్రభావం ఉండదని అంటున్నారు. ఈ విషయాన్ని బీఆర్‌ఎస్‌ నేతలు గుర్తించడం లేదని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే క్యాడర్‌ మొత్తం కేసులపాలై కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని అంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular