TTD Deputy EO Lokanatham: లెక్కకు మిక్కిలి వెండి.. అంతకు మించిన స్థాయిలో బంగారం.. లాకర్లు.. నోట్ల కట్టలు.. ఖరీదైన స్థలాలు.. ఇలా ఒక్కటేమిటి చాలా ఉన్నాయి. లెక్కించడానికి యంత్రాలు సరిపోలేదు. మనుషుల మేధస్సు కూడా సరి రాలేదు. ఇదంతా కూడా టిటిడి డిప్యూటీఈవో ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు చేస్తుంటే బయటపడింది.
2011లో టీటీడీ డిప్యూటీ ఈవోగా భూపతిరెడ్డి ఉన్నారు. నాడు ఆయన మీద అనేక రకాలుగా ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా వివిఐపీలకు దర్శనాలు కల్పించే క్రమంలో ఆయన చూపించిన చొరవ.. పొందిన ప్రయోజనాలు ఇవన్నీ కూడా నాడు ఏసీబీ అధికారులకు తెలిసాయి. దీంతో వారు అన్ని విషయాలను లోతుగా తవ్వారు. పకడ్బందీ ఆధారాలతో రంగంలోకి దిగారు. ఆ తర్వాత భూపతి రెడ్డి ఇంట్లో దాడులు చేశారు. భారీగా బంగారం.. వెండి.. ఇతర ఖరీదైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. భారీ ఎత్తున నగదును కూడా గుర్తించారు.
సరిగ్గా 15 సంవత్సరాల తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో మెండు లోకనాథం నివాసంలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని అభియోగాల నేపథ్యంలో ఏసీబీ అధికారులు తిరుపతి పెద్దకాపు లే అవుట్ లోని లోకనాథం ఇల్లు.. ఆయన బంధువుల గృహాలలో ఏకకాలంలో తనిఖీలు చేపడుతున్నారు. ఏసీబీ డిఎస్పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచి పోలీసులు ఏడు బృందాలుగా విడిపోయారు. విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. లోకనాథానికి సంబంధించిన గెస్ట్ హౌస్.. తిరుపతిలో ఉన్న లోకనాథం బావమరుదుల గృహాలు.. ఏర్పేడు మండలం చెల్లూరు ప్రాంతంలో ఉన్న లోకనాథం సోదరి ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.
తిరుపతిలోని ఎస్ టి వి నగర్ ప్రాంతంలో లోకనాధానికి సంబంధించిన ఎస్బిఐ లాకర్లను తెరిచి పరిశీలిస్తున్నారు. ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నప్పుడు లోకనాథం ఇంట్లోనే ఉండడం విశేషం. ఏసీబీ అధికారుల తనిఖీలలో కోట్ల రూపాయల విలువైన బంగారం.. స్థిర ఆస్తులు.. చర ఆస్తులు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. లోకనాథం డిప్యూటీ ఈవోగా వచ్చిన దగ్గరనుంచి అతని స్థాయి మారిపోయిందని ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీనికి తోడు ఆయన వ్యవహార శైలని పూర్తిగా మార్చుకున్నారు. వివిఐపీల సేవలో తరించడం మొదలుపెట్టారు. తద్వారా భారీగా ప్రయోజనాలు పొందారు. లోకనాథం మీద ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులకు.. బంగారం.. వెండి.. నగదు లభించిన నేపథ్యంలో.. లోతుగా లోకనాథం అవినీతి వ్యవహారాన్ని తవ్వుతున్నారు.