TTD Deputy EO: ఏపీలో సైతం అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. ఇప్పటివరకు తెలంగాణ ఏసీబీ మాత్రమే భారీ అవినీతి అధికారులను పట్టుకుంది. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీ ఏసీబీ పెద్ద స్థాయిలో అవినీతి అధికారులను పట్టుకోవడం తక్కువ. కానీ తాజాగా ఓ 100 కోట్ల రూపాయల అవినీతి అధికారిని ఏపీ ఏసీబీ పట్టుకోవడం సంచలనంగా మారింది. అయితే ఈసారి ఏకంగా టీటీడీ ఎలక అధికారి ఏసీబీకి పట్టు పడడం విశేషం. తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో మెండు లోకనాథం భారీ అక్రమ ఆర్జనకు సంబంధించి ఏసీబీ అధికారులు గుట్టు రట్టు చేశారు. లోకనాథం నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం ఉదయం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడా పెట్టారనే పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టారు.
* ఏకకాలంలో దాడులు..
తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్ లో ఉన్న లోకనాథం ఇంటిపై ముందుగా దాడి చేశారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో అధికారుల బృందం ఉదయం 6 గంటల నుంచి ఏకకాలంలో మొత్తం ఐదు ప్రాంతాల్లో తనిఖీలు ప్రారంభించారు. తిరుమలలో ఉన్న లోకనాథం కార్యాలయం తో పాటు తిరుపతిలోని ఆయన ఇద్దరు బావమరుదుల నివాసాలు, ఏర్పేడు మండలం చెల్లూరు లోని ఆయన సోదరుడు ఇంటిపై కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు జరిపారు. టీటీడీలో కీలక పదవిలో ఉంటూ అక్రమార్జనకు పాల్పడ్డారని ఏసీబీకి పక్క సమాచారం వచ్చింది. అందుకే విస్తృత తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.
* సమూల ప్రక్షాళన..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ ప్రక్షాళన పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు అంశాలపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. అధికారుల స్థాయిలో అవినీతికి పాల్పడిన వారిపై కూడా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే మెండు లోకనాథం పై ఏసీబీ దాడిగా తెలుస్తోంది. గతంలో శ్రీవారి ఆలయ విధుల్లో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు వచ్చిన ఫిర్యాదులపై లోతుగా విచారణ జరిపిన తరువాత మాత్రమే లోకనాథం పై ఏసీబీ తనిఖీలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ తనిఖీల్లో కీలక ఆస్తుల పత్రాలు, నగదు బ్యాంకు లాకర్లు, బాండ్లు, వివిధ రంగాల్లో పెట్టిన అక్రమ పెట్టుబడులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు లోకనాథం బంధుమిత్రుల పేరుతో ఉన్న బినామీ ఆస్తులపై కూడా ఏసీబీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. అయితే ఒక డిప్యూటీ ఈవో స్థాయి అధికారిపై ఏసీబీ దాడులు జరగడం నిజంగా ఆందోళన కలిగించే విషయమే. దీంతో టీటీడీ అధికార వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.