HomeతెలంగాణLok Sabha Election 2024: తెలంగాణలో త్రిముఖ పోరు.. విజయమెవరిదో?

Lok Sabha Election 2024: తెలంగాణలో త్రిముఖ పోరు.. విజయమెవరిదో?

ఎన్నికల వేళ మూడు పార్టీలు మూడు ప్రధాన సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఎన్నికల్లో మెజారిటీ సీట్లు రాకపోతే.. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతుందేమో అన్న ఆందోళన రేవంత్‌ సర్కార్‌కు నెలకొంది.

Lok Sabha Election 2024: పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో విచిత్ర రాజకీయం వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్య ఉండగా, లోక్‌సభ ఎన్నికలు వచ్చే సరికి పరిణామాలు మారిపోయాయి. కేంద్రంలో ఏ ప్రభుత్వం కావాలో నిర్ణయించే ఈ ఎన్నికల్లో విజయం కోసం తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీతోపాటు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్‌ హోరాహోరీగా తలపడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల విజయాన్ని లోక్‌సభ ఎన్నికల్లో కొనసాగించాలని కాంగ్రెస్‌ ఉవ్విల్లూరుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మూడోసారి మోదీని ప్రధాని చేయాలని, మోదీనే దేశానికి రక్ష అన్న నినాదంతో దూసుకుపోతున్నాయి. ఇక బీఆర్‌ఎస్‌.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఊరట పొందే ఫలితాల కోసం చెమటోడుస్తోంది.

ఒక్కో పార్టీకి ఒక్కో సమస్య..
ఇదిలా ఉంటే.. ఎన్నికల వేళ మూడు పార్టీలు మూడు ప్రధాన సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఎన్నికల్లో మెజారిటీ సీట్లు రాకపోతే.. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతుందేమో అన్న ఆందోళన రేవంత్‌ సర్కార్‌కు నెలకొంది. 2019లోనే తెలంగాణ ప్రజలు బీజేపీకి మంచి ఫలితాలు ఇచ్చారని, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరిగినందున మరిన్ని మంచి స్థానాలు సాధించాలని కమలం నేతలు భావిస్తున్నారు. ఇక బీఆర్‌ఎస్‌ పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. ఎన్నికల్లో ఒక్కసీటు గెలవకపోయినా.. పార్టీ ఉనికే ప్రశ్నార్తకమవుతుందని గులాబీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ అధినేత క్యాడర్‌లో ఊపు తెచ్చేందుకు బస్సు యాత్ర చేపట్టబోతున్నారు.

మూడు పార్టీల మైండ్‌గేమ్‌..
లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కోసం ఇప్పుడు తెలంగాణలో మూడు పార్టీలు మైండ్‌ గేమ్‌ ఆడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ సర్కార్‌ కూలిపోతుందని బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తున్నాయి. దీంతో లోపల ఆందోళన ఉన్నా.. రేవంత్‌ మాత్రం ఈ నినాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అని మరోమారు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్‌ నేతలను పార్టీలో చేర్చుకుంటూ కేసీఆర్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే బీజేపీ ఒక్కటే కాస్త ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆ పార్టీ చాలా ధీమాగా పావులు కదుపుతోంది. ఇటు కాంగ్రెస్‌ను, ఆటు బీఆర్‌ఎస్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోంది.

బీజేపీ జోలికి వెళ్లని బీఆర్‌ఎస్‌..
ఇదిలా ఉంటే.. బీఆర్‌ఎస్‌ ప్రస్తుతం బీజేపీ జోలికి వెళ్లడంలేదు. అధికారంలో ఉన్నప్పుడు సొంత మీడియాలో మోదీపై, బీజేపీపై పుంకాను పుంకాలుగా కథనాలు రాసింది. కేసీఆర్‌ అయితే బీజేపీని బంగాళాఖాతంలో కలుపుతానని హెచ్చరించారు. తాజాగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్‌ బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు. కేటీఆర్, హరీశ్‌రావు కూడా మౌనం వహిస్తున్నారు. కేవలం కాంగ్రెస్‌నే టార్గెట్‌ చేస్తున్నారు. దీంతో ఇదంతా కవిత కోసమే అని సీఎం రేవంత్‌ ఆరోపిస్తున్నారు. మరోవైపు కేసీఆర్, కేటీఆర్‌ మాత్రం రేవంత్‌ సర్కార్‌ను బీజేపీ కూలుస్తుందని, రేవంత్‌ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరతారని ఆరోపిస్తున్నారు. రేవంత్‌ మాత్రం తమ ప్రభుత్వాన్ని టచ్‌ చేస్తే మాడి మసైపోతారని హెచ్చరిస్తున్నారు. ఎన్నిల తర్వాత బీఆర్‌ఎస్‌ ఖాళీ అవుతుందని ప్రచారం చేస్తున్నారు. మూడు పార్టీలు ఆడుతున్న మైండ్‌ గేమ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారు అనేది జూన్‌ 4న తేలనుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper