24 Hours Electricity: ‘‘తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరిగింది. రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఇస్తున్నాం.. దేశంలో అత్యధిక కరెంటు వినియోగిస్తున్న రాష్ట్రం తెలంగాణ. మోటార్లకు మీటర్లు పెట్టుమంటే.. నేను సచ్చినా పెట్ట అన్న.. కాంగ్రెస్ కావాల్నా.. కరెంటు కావాల్నా’’ ఇవీ మొన్నటి వరకు తెలంగాణ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చెప్పిన మాటలు. ఇవన్నీ నిజమే అని తెలంగాణ ప్రజలు నమ్మారు. కానీ, పదేళ్ల కుటుంబ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఈసారి కాంగ్రెస్కు పట్టం కట్టారు. ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే కేబినెట్ సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్.. విద్యుత్ సంస్థలు రూ.85 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోవడం చూసి విస్మయం వ్యక్తం చేశారు. పూర్తి నివేదికలతో డిసెంబర్ 8న రావాలని ఆదేశించారు.
సమీక్షలో లోబాలు బహిర్గతం..
తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు, గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు సీఎం రేవంత్రెడ్డి తొలుత విద్యుత్ సంస్థ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ గత ప్రభుత్వం కరెంట్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంది. గతంలో కరెంట్ ఉంటే చెప్పుకునేవాళ్లమని.. ఇప్పుడు కరెంట్ పోతే చెప్పుకుంటున్నామని వాదించారు. లిప్తపాటు కరెంట్ పోదని ప్రచారం చేశారు. అదే తాము అధికారంలోకి రాక పోతే మళ్లీ విద్యుత్ పరిస్థితి పాత రోజులకు వెళ్లిపోతుందని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. వారు అలా ఎందుకు అన్నారో కానీ గత పదేళ్లలో విద్యుత్ సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. భారీ మొత్తం వెచ్చించి బయట కొనడమే తప్ప ఉత్పత్తి పెంచుకునే ప్రయత్నం చేయలేదు.
పదేళ్లలో రూ.60 వేల కోట్ల అప్పు..
2014 నుంచి 2023 వరకు గడిచిన పదేళ్లలో విద్యుత్ సంస్థల అప్పులు 60 వేల కోట్లకుపైగా పెరిగాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ సంస్థల అప్పులు ఊహించనంతగా పెరిగిపోయాయి. విద్యుత్ సంస్థలు మొత్తం నాలుగు ఉంటాయి. రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు ఉన్నాయి. వీటిని డిస్కంలు అంటారు. ట్రాన్స్ కో .. విద్యుత్ సరఫరా సంస్థ..జెన్ కో విద్యుత్ సంస్థ. ఈ సంస్థలను రాష్ట్ర విభజన సమయంలో విభజించినప్పుడు ఉన్న అప్పు రూ. 22,423 కోట్లు. ఇప్పుడు బీఆర్ఎస్ సర్కార్ దిగిపోయే నాటికి వాటి అప్పులు 81,156 కోట్ల రూపాయలు. అంటే దాదాపుగా ఏడాదికి ఆరు వేల కోట్ల చొప్పున అప్పులు పెరిగిపోతూనే ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి లేదు భారీ ఖర్చుతో కొనుగోలు అసలు విద్యుత్ సంస్థల అప్పులన్నీ దీర్ఘ కాలిక ప్రయోజనాల కోసం ఆస్తుల సృష్టి కోసం ఉపయోగించలేదు. బహిరంగ మార్కెట్నుంచి విద్యుత్ కొనుగోలు కోసం తీసుకున్న రుణాలే ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటివే రూ.30 వేల కోట్లు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
నెలకు రూ1,300 కోట్ల వడ్డీ..
విద్యుత్ సంస్థల అప్పులకు వడ్డీనే నెలకు 1,300 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. కేవలం నిరంతరాయంగా కరెంట్ ఇస్తున్నామని చెప్పుకోవడానికి.. విద్యుత్ సంస్థల్ని నిండా ముంచారన్న అభిప్రాయం నిపుణుల్లో వినిపిస్తోంది. కొత్త ప్లాంట్ల నిర్మాణలో అవినీతి రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ 7,700 మెగావాట్లు, ఏపీకి 9,500 మెగా వాట్ల స్థాపిత సామర్థ్యంతో ప్లాంట్లు దక్కాయి. గత నాటికి ఆ సామర్థ్యం తెలంగాణలో 18,500 మెగా వాట్లకు పెరిగింది. ఏపీలో 20,500 మెగా వాట్లకు పెరిగింది. అంటే ఎన్నో వేల కోట్లు అప్పులు చేసిన తెలంగాణ కంటే ఏపీలోనే విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. చంద్రబాబు ఏపీలో ఐదేళ్లు సీఎంగా ఉన్న సమయంలో విద్యుత్ పరిస్థితిని మెరుగు పరిచారు. రేట్లు తగ్గించే ఆలోచన చేశారు.
తెలంగాణలో వివాదాస్పదం..
కొత్త ప్లాంట్ల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వ తీరు వివాదాస్పదమయింది. యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ ఇప్పటికీ రెడీకాలేదు. డిజైన్ సరిగ్గా లేకపోవడం బొగ్గు ఎక్కువగా వినియోగించుకునే డిజైన్ వాడటంతో పాటు అటవీ ప్రాంతం డిస్ట్రర్బ్ అవుతుందని ఎన్టీటీ అనుమతులు కూడా రాలేదు. నాలుగు వేల మెగావాట్లు ఆ ప్లాంట్ల నుంచి రావాల్సి ఉంది. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులోనూ భారీ స్కాం జరిగిందన్న విమర్శలు వచ్చాయి.
డిస్కంల అప్పులు రూ.50 వేల కోట్లు..
ఇక రెండు డిస్కంల నష్టాలు రూ.50 వేల కోటు.్ల అప్పులే కొండంత ఉంటే విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు ఊహించనంతగా పెరిగిపోయాయి. రెండు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు రూ. 50 వేల కోట్లకుపైగా అప్పు ఉన్నట్లుగా తేలింది. ఈ అప్పులు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. కారణం ఆదాయానికి.. ఖర్చునకు పొంతన లేకపోవడమే. ఆరు నెలలకే ఆదాయ వ్యయాల మధ్య లోటు పదకొండు వేల కోట్లుగా ఉంటుందని అధికారులు లెక్క చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో రెండు డిస్కంల నష్టాలు కేవలం రూ.2281 కోట్లు మాత్రమే. పదేళ్లలో ఊహినంత వేగంగా అప్పులు పెరిగిపోయాయి.
సింగరేణికి భారీగా బకాయిలు..
బొగ్గు సరఫరా చేస్తున్న సంగరేణి సంస్థలకూ వేల కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి రావాల్సినవి రూ .21 వేల కోట్ల పైనే ప్రభుత్వం విద్యుత్ ను ఇష్టారాజ్యంగా వాడుకుంటోంది. సొంత ఆస్తిలాగా వాడుకుంటోంది. ఓట్లు రాల్చే పథకాలకు వినియోగించుకుంటోంది. కానీ ఆ బిల్లులు తిరిగి చెల్లించడం లేదు. ప్రభుత్వం విద్యుత్ వాడుకున్నందుకు రూ.21వేల కోట్లపైగా విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సి ఉంది. ఇందులో అత్యధికంగా ఇరిగేషన్ డిపార్టు మెంట్ 9 వేల కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంది. తర్వాత పంచాయతీరాజ్, మున్సిపాలిటీలు, హైదరాబాద్ జలమండలి, ఇతర శాఖలు అంతా కలిపి రూ.21 వేల కోట్లు బాకీ పడ్డాయి. ఇవి తిరిగి ఇస్తే విద్యుత్ సంస్థలు కొంత బయటపడతాయి.
కరెంట్ కథలన్నీ ప్రభాకర్ రావువే..
తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యుత్ సంస్థలను కేసీఆర్ ప్రభాకర్ రావు చేతికి అప్పగించారు. ఏం చేసైనా సరేం నిరంతరాయ విద్యుత్ ఇవ్వాలన్న కేసీఆర్ ఆదేశాలను ఆయన ఇలా ఉపయోగించుకున్నారు. విచ్చలవిడిగా బయట నుంచి కొనుగోలు చేసిం విద్యుత్ సంస్థలపై అప్పుల భారం పెట్టారు. ఇప్పుడు కోలుకోలేనంతగా విద్యుత్ సంస్థలపై భారం పెరిగిపోయింది.