Telangana MPs: ప్రజలు ఓటు వేసి గెలిపించారు. బ్రహ్మాండమైన మెజారిటీ అందించారు. మా కోసం పని చేయండి అని విన్నవించారు. కానీ గెలిచిన ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు.. ప్రజలు పరోక్షంగా చెప్పిన మాటలను పక్కనపెట్టి.. తమకు కావలసిన పనులు చేసుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 23 మంది పార్లమెంట్, రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. వీరికి గడిచిన రెండు సంవత్సరాల కాలంలో ఎంపీ లాడ్స్ కింద 394.8 కోట్లు నిధులు లభించాయి. వీటిని వివిధ పనుల కోసం ఉపయోగించాల్సిన ఎంపీలు.. వాటిని పక్కన పెట్టారు. ప్రజల కోసం పనికి వచ్చే పనులకు వారు ఖర్చు చేయలేకపోయారు. ఈ విషయం ఏం పవర్డ్ ఇండియన్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో బయటికి వచ్చింది.
జాతీయ సగటు నిధుల వినియోగం ఏకంగా 33 శాతం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అతి కేవలం 23 శాతం మాత్రమే ఉంది. తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ ఎంపీలలో కిషన్ రెడ్డి 3.23% నిధులు వినియోగించారు. బండి సంజయ్ 38%.. అరవింద్ 56%.. బలరాం నాయక్ 49 శాతం.. వద్దిరాజు 45%, రాజేందర్ 10.6%, అసదుద్దీన్ 7.6%, రేణుక చౌదరి 2.8%, పార్థసారథి 2.43% నిధులు మాత్రమే ఖర్చు చేశారు. ఆరుగురు ఎంపీలు కేవలం పది శాతం లోపు మాత్రమే నిధులు ఖర్చు చేయడం విశేషం.
చాలామంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు జరగడం లేదు. కొన్ని ప్రాంతాలు అయితే సరిగా రోడ్లు కూడా లేవు. వర్షాలు వస్తే రోడ్లమీద మురికినీరు ప్రవహిస్తూ ఉంటుంది.. ఎంపీ నిధులతో రోడ్లు నిర్మించవచ్చు. డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయవచ్చు. పారిశుధ్యం మెరుగుపరచవచ్చు. ఇంకా అనేక రకాల పనులు చేయవచ్చు. కానీ ఇవేవీ చేయడం లేదు. ఎంపీలు నిధులను ఖర్చు చేయడం లేదు. దీంతో అభివృద్ధి అనేది ఆగిపోతుంది. ప్రజల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ఎన్నడూ కూడా ఎంపీల నిధులలో కోత విధించలేదు. ఇప్పుడు దండిగా నిధులు విడుదల చేస్తోంది. అయినప్పటికీ ఎంపీలు వాటిని ఖర్చు చేయడంలో విఫలమవుతున్నారు. వాస్తవానికి ఈ నిధులతో ఇంకా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది . కానీ మన ఎంపీలు ఆ విషయాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారు. వచ్చిన నిధులను ఖర్చు చేయకుండా చోద్యం చూస్తున్నారు