OMAD Diet : నేటి కాలంలో చాలా మంది బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఇంట్లో వండిన ఆహారం కంటే బయట దొరికే ఫుడ్ టేస్టీగా ఉండడంతో వాటి వైపే ఆసక్తి చూపుతున్నారు. అయితే బరువు తగ్గేందుకు కొందరు సెలబ్రెటీలు పాటిస్తున్న పద్ధతులను ఫాలో అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కొందరు తమకు ఇష్టమైన నటులు, నటీమణులు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు? వాళ్లు ఎలాంటి డైట్ పాటిస్తున్నారు? వంటి విషయాలను తెలుసుకుంటున్నారు. అయితే ఇటీవల బాలీవుడ్ ప్రముఖ నటుడు రాజ్ కుమార్ గతంలో టిఫిన్, లంచ్ మానేసి కేవలం డిన్నర్ మాత్రమే చేశానని, దీంతో 10 కిలోల బరువు తగ్గానని చెప్పాడు. దీంతో ఇలా చేస్తే బరువు తగ్గుతారా? అన్న చర్చ సాగుతోంది. అయితే దీనిపై కొందరు ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే?
బరువు పెరగడం.. తగ్గడం.. అందరిలో ఒకలా ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే కొందరు తక్కువ ఆహారం తీసుకున్నా.. అధిక బరువుతో ఉంటారు. మరికొందరు చాలా వరకు ఫుడ్ టీసుకుంటున్నా ఎలాంటి బరువు పెరగరు. అయితే ప్రతిరోజూ ఒక్కపూట మాత్రమే భోజనం చేస్తే బరువు తగ్గుతారా? అనేదానిపై స్పష్టత లేదని అంటున్నారు. ఎందుకంటే సినిమా నటులు తమ లక్ష్యం కోసం డైట్ పాటిస్తారు. ఈ డైట్ ను ఎప్పటికీ ఫాలో అవుతారన్నది చెప్పడం కష్టమే.
అయితే బరువు తగ్గాలంటే ఏం చేయాలి? అన్న ప్రశ్న చాలా మందిలో ఉంటోంది. టిఫిన్, లంచ్ మానేస్తే శరీరానికి ఆహారం తీసుకోవడం తక్కువవుతుంది….దీంతో బరువు తగ్గొచ్చు.. అన్న భావనలో ఉంటారు. కానీ ఈ రెండు పూటలు ఆహారం తీసుకోకుండా.. కేవలం డిన్నర్ మాత్రమే చేయాలని అనుకుంటే.. ఆసమయంలో ఎక్కువ ఆహారాన్ని తీసుకోవాల్సి వస్తుంది. దీంతో మోతాదుకు మించి ఒకేసారి ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇలాంటి డైట్ వారానికి ఒకసారి అయితే పర్వాలేదు. కానీ ప్రతిరోజూ అందరిలో వర్కౌట్ కాదని అంటున్నారు.
బరువు తగ్గేందుకు రోజులో ఎంత తిన్నామన్నది కాకుండా.. ఎలా తీసుకుంటున్నామనేది ఇంపార్టెంట్ అని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ఒక రోజులో కనీసం మూడు లేదా నాలుగు సార్లు తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తూ.. జీర్ణక్రియ సక్రమంగా ఉంటుంది. దీంతో శరీరంలో అనవసరపు కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. ఫలితంగా బరువు పెరిగే అవకాశం ఉండదు.
అంతేకాకుండా ఇప్పటికే బరువు ఉన్నవారు.. తగ్గాలనుకుంటే ప్రోటీన్లు కలిగిన ఆహారం తీసుకుంటూ తక్కువ మొత్తంలో మిగతా ఆహారాన్ని తీసుకోవాలని అంటున్నారు. అయితే ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సలహాలు పాటించాలి.