Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని విషయాలలో దూకుడుగా ఉంటారు. అది చాలామందికి నచ్చుతుంది. కొన్ని విషయాలలో గొప్పగా ఆలోచించలేరు. అది చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. అతని దూకుడు ఏ స్థాయిలో అయితే మైలేజ్ తీసుకొస్తుందో.. కొన్ని సందర్భాలలో అతని ఆలోచన లోపం అంతకుమించిన స్థాయిలో శత్రువులను పోగుచేస్తుంది.
సాధారణంగా నక్కలు అరుస్తున్నప్పుడు పులులు భయపడకూడదట. ఒకసారి పులులు భయపడితే నక్కలు గుంపులుగా దాడులు చేస్తాడట. రేవంత్ రెడ్డి కొన్ని సందర్భాలలో సరిగ్గా ఆలోచన చేయకపోవడం కొంతమంది శక్తులకు అనవసరమైన ప్రాధాన్యం ఇచ్చినట్టు అవుతోంది. దీనివల్ల వారు వేసే కేరింతలు.. ఇబ్బందికరమైన వాతావరణానికి కారణమవుతున్నాయి. తద్వారా రేవంత్ బలహీనమవుతున్నారు. మీడియాలో.. సోషల్ మీడియాలో ఒక ప్రణాళిక ప్రకారం రేవంత్ మీద దర్జాగా కుట్ర జరుగుతోంది. ఈ కుట్రను చేదించడానికి అనేక రకాల మయోపాయాలు ప్రయోగించాలి. కానీ ఆ విషయంలోనే రేవంత్ రెడ్డి తడబడుతున్నారు.. తప్పుడు అడుగులు వేస్తున్నారు.
రాజకీయాల్లో అజాతశత్రువుగా ఉండడం అంత ఈజీ కాదు. ఒకవేళ ఉన్నా.. అజాతశత్రువులాగా ఉండే రాజకీయ నాయకులకు కొంతమంది అనంగు మిత్రులు ఉండాలి. అలా లేని పక్షంలో ఇబ్బంది పడక తప్పదు. ఉదాహరణకు వైయస్ రాజశేఖర్ రెడ్డిని తీసుకుంటే.. ఆయనకు కెవిపి రామచంద్రరావు అత్యంత ఆప్తమిత్రుడు. ఒకరకంగా ఆయనను వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ అని పిలిచేవారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు.. అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ ఇబ్బందులను కెవిపి రామచంద్రరావు సులువుగా పరిష్కరించేవారు. తద్వారా రాజశేఖర్ రెడ్డి రాజకీయాలను అత్యంత చాకచక్యంగా చేయగలిగే వారు. రకరకాల వ్యక్తులు.. రకరకాల నేపథ్యాలు కలిగిన వ్యక్తులు ఉండే కాంగ్రెస్ పార్టీలో.. పట్టు సాధించడం అంత ఈజీ కాదు. కాని దానిని చేసి చూపించారు రాజశేఖర్ రెడ్డి.
ఇప్పటి తెలంగాణ రాజకీయాలలో రేవంత్ రెడ్డికి ఒక కేవీపీ రామచంద్ర రావు లాంటి ఆప్తుడు చాలా అవసరం. ఎందుకంటే లండన్ పర్యటన ముగించుకుని తెలంగాణకు వచ్చిన రేవంత్ రెడ్డికి స్వాగతం పలకడానికి శంషాబాద్ విమానాశ్రయానికి కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే వచ్చారు. ఇక సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశానికి చాలామంది మంత్రులు ఆలస్యంగా వచ్చారు. కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిగతావారు దూరంగా ఉన్నారు. ఇటువంటి పరిణామాలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్తుంటాయి. ప్రత్యర్థులకు.. సో కాల్డ్ మీడియా సంస్థలకు అనవసరమైన ఆయుధాన్ని ఇచ్చినట్టు అవుతాయి. ఇలాంటి అప్పుడు రేవంత్ రెడ్డి.. సొంత సోదరులను నమ్ముకోకుండా.. తనకంటూ ఒక బలమైన స్నేహితుడిని లేదా బలమైన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
గతంలో కొడంగల్ లో గెలిచినప్పుడు.. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో విజయం సాధించినప్పుడు రేవంత్ రెడ్డి సోదరులు చాలావరకు కష్టపడ్డారు. కానీ ఎమ్మెల్యేగా గెలవడం వేరు.. ఎంపీగా విజయం సాధించడం వేరు. ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించడం వేరు. వీటికి తేడాలు తెలుసుకున్న నాడు రేవంత్ రెడ్డిని ఎవరూ అడ్డుకోలేరు. మూడు సంవత్సరాలుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా పని చేస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పటికీ సంక్షోభాలు ఎదుర్కోవడం.. పరిపాలనపరంగా సమస్యలను చవిచూడడం వంటివి చూస్తుంటే జాలి కలగకమానదు. ఇటీవల కాలంలో వచ్చే కొన్ని టర్మ్ లు తనే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ రెడ్డి అంటున్నారు. అది జరగాలంటే చాలా లోపాలను అధిగమించాలి. అన్ని సమస్యలను పరిష్కరించుకో గలిగాలి. అప్పుడే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీద.. తెలంగాణ గడ్డమీద తిరుగులేని నాయకుడిగా నిలబడగలుగుతారు.