Revanth Reddy : అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉండవచ్చు. నాయకులకు స్వేచ్ఛ ఎక్కువగా ఉండవచ్చు. అలాగని తిన్నింటి వాసాలు లెక్కపెడితే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. ఇప్పుడు ఇదే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ కొనసాగిస్తుంది. నిన్నటిదాకా చాలామంది నాయకుల విషయంలో వేచి చూసే ధోరణి ప్రదర్శించిన కాంగ్రెస్ అధినాయకత్వం ఇప్పుడు ఏకంగా.. చర్యలకు ఉపక్రమించింది.
నిజమే కాంగ్రెస్ పార్టీలో ముందుగానే ఎమ్మెల్యేలను ప్రకటించే అవకాశం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేకుండా.. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్.. ఈ విషయంలో కొండ సుస్మితను కొండా సురేఖ ఎందుకు మందలించలేదు.. అసలు తన కుమార్తె వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని చెప్పిన ఆమె.. అసలు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేని మహిళ ముఖ్యమంత్రిని విమర్శించే హక్కు లేదని ఎందుకు చెప్పలేకపోయింది. పైగా తన కూతురు చేసిన వ్యాఖ్యలు సరైనవే అన్నట్టుగా ఉంది సురేఖ వ్యవహార శైలి. పైగా తన మీద అజ్ఞాత వ్యక్తి కుట్రలు చేస్తున్నారని.. ఇబ్బంది పెడుతున్నారని.. రాజకీయంగా తొక్కి వేస్తున్నారని ఏదో రాసుకుంటూ పోయింది.
రేవంత్ రెడ్డి లండన్ నుంచి రాగానే సురేఖ విషయం మీద మాట్లాడతారు అనుకున్నారు. కానీ ఆయన ఇదంతా కూడా క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని చెప్పారు. ఇక ఇటీవల కొండా సురేఖ ఎపిసోడ్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా క్లారిటీ ఇచ్చారు. తాను గతంలో అవకాశం ఉంటే చేశానని.. ఇప్పుడు అది కూడా లేదని మహేష్ కుమార్ ఓపెన్ గానే చెప్పేశారు. ఇప్పుడు తాజాగా జరుగుతున్న సన్నివేశం ఏంటంటే.. మంత్రి పదవి నుంచి సురేఖని తప్పించాలని కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ అభిప్రాయపడింది. ఎన్ని పర్యాయాలు హెచ్చరించినప్పటికీ ఆమె వైఖరిలో మార్పు లేదని క్రమశిక్షణ కమిటీ స్పష్టం చేసింది. పార్టీ లైన్ దాటితే చర్యలు తీసుకోవాల్సిందేనని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమని.. చర్యలు తీసుకోకపోతే పార్టీకే నష్టమని తేచి చెప్పింది. మరోవైపు చిన్నారెడ్డిని కూడా ప్లానింగ్ కమిషన్ నుంచి తొలగించాలని సూచించింది ఈ నివేదికలను పిసిసి అధినేత మహేష్ కుమార్ గౌడ్ కు కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ బాధ్యులు మల్లు రవి సమర్పించారు.
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ కు నివేదిక అందిన నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రితో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రకారం రేపు లేదా ఎల్లుండి సురేఖ మంత్రివర్గం నుంచి బర్త రఫ్ అవకాశం ఉంది. ఒకవేళ మంత్రి పదవిని కోల్పోతే సురేఖ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తారా.. ఒకవేళ రాజీనామా చేస్తే బీజేపీలోకి వెళ్తారా.. జనసేన కండువా కప్పుకుంటారా.. అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే జనసేనలో కొండ సుస్మిత చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మీడియాలకు కూడా దీనికి సంబంధించి వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇంతవరకు సుస్మిత జనసేనలో చేరుతున్నట్టు అధికారికంగా ప్రకటించలేదు. జనసేన నాయకులు కూడా ఈ విషయం మీద ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. సో ఈ ప్రకారం చూసుకుంటే కూతురు మాట్లాడిన మాటలు కొండా సురేఖ రాజకీయ భవితవ్యాన్ని తీవ్రమైన ప్రమాదంలోకి నెట్టివేశాయని విశ్లేషకులు అంటున్నారు.