Konda Surekha: కూతురు చేసిన వ్యాఖ్యలతో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తన పదవికి ఎసరు తెచ్చుకున్నారు. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చేశారు. గతంలో తాను సురేఖను కాపాడానని .. ఇప్పుడు ఆ అవకాశం లేదని క్లారిటీ ఇచ్చారు. పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే ఎవరికైనా సరే ఇటువంటి పరిణామాలు ఎదురవుతాయని పేర్కొన్నారు. అనిరుద్ రెడ్డి.. రాజగోపాల్ రెడ్డి పరోక్షంగా మాట్లాడారని.. వారు నేరుగా ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేయలేదని మహేష్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇచ్చారు.
కొండా సురేఖ భర్త మురళి భట్టి విక్రమార్కను కలవడానికి ప్రయత్నించారు. అయితే విక్రమార్క ఆయనకు అవకాశం ఇవ్వలేదు. దీనికి తోడు మంత్రులు అడ్లూరి లక్ష్మణ్.. ఇతర ఎమ్మెల్యేలు సురేఖ మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవూరి ప్రకాష్ రెడ్డి అయితే ఏకంగా సురేఖ కూతుర్ని ఉద్దేశించి పిల్ల కాకి.. అని సంబోధించారు. ఈ ప్రకారం చూసుకుంటే కొండా సురేఖ పదవి ఊడిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
కొండ సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలు ఏకంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి కావడం.. అది కూడా ఆమె తీవ్రస్థాయిలో ముఖ్యమంత్రి నెత్తికి కళ్ళు ఎక్కాయని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. సాధారణంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అంత దారుణంగా విమర్శించకూడదు. అలా మాట్లాడితే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉంటుంది కాబట్టి.. కొండా సురేఖ ఇంకా పదవిలో ఉండగలుగుతున్నారు. ఒకవేళ భారత రాష్ట్ర సమితి లేదా భారతీయ జనతా పార్టీలో అయితే పరిణామం వేరే విధంగా ఉండేదని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
కొండా సురేఖ కుమార్తె మాట్లాడిన మాటలు కాంగ్రెస్ అధిష్టానం వరకు కూడా వెళ్లాయని.. ఈ సమయంలో సరైన క్రమశిక్షణ చర్యలు పాటించకపోతే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని ఇప్పటికే వేగులు అధిష్టానానికి చెప్పినట్టు తెలుస్తోంది. అందువల్లే మహేష్ కుమార్ గౌడ్ అధిష్టానం వైఖరిని తన మాటగా చెప్పారని.. సురేఖ పదవి కోల్పోవడం ఖాయమని తెలుస్తోంది.
ఇటీవల కొండా సురేఖ మాజీ వ్యక్తిగత కార్యదర్శి సుమంత్ మీద ప్రభుత్వం కేసులు పెట్టింది. ఒక కాంట్రాక్టర్ విషయంలో సుమంత్ ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఇనుప రాడ్డుతో ఆయనను కొట్టారు. ఈ వ్యవహారంలో కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు సుమంత్ మీద కేసు నమోదయింది. గతంలో సుమంత్ కోసం ఏకంగా సురేఖ కుమార్తె రంగంలోకి దిగింది. డబ్బుల వసూళ్లకు సంబంధించి సుమంత్ తమను ఇబ్బంది పడుతున్నారని సిమెంట్ కంపెనీల యజమానులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో సుమంత్ ను విధుల నుంచి ప్రభుత్వం తొలగించింది. అతడిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే హోండా సురేఖ కుమార్తె అడ్డుకుంది.
అప్పట్లోనే సురేఖ కుమార్తె రచ్చ రచ్చ చేసింది. చివరికి అప్పట్లో ప్రభుత్వం ఉన్న కొంత మంది మీద ఆమె ఆరోపణలు చేసింది. వాస్తవానికి అప్పట్లోనే ఆమె పదవి పోతుందని ప్రచారం జరిగింది.. దానికంటే ముందు సినీ నటుడు నాగార్జున కుటుంబం మీద సురేఖ తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. అప్పట్లో రేవంత్ ప్రభుత్వం ఆమెకు అండగా ఉంది. సురేఖ లేదా ఆమె కుమార్తె లేదా కొండా మురళి ప్రతిసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. పరిపాటిగా మారిపోవడంతో.. ఆమెను తప్పించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే ఇంకా కొద్దిరోజులు సమయం పట్టి అవకాశం ఉంది.